అశ్వారావుపేట, డిసెంబర్ 13: వ్యవసాయ భూములు ఆరోగ్యంగా ఉంటే నాణ్యమైన దిగుబడులు అందుకోవచ్చు. అందుకు రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే వృథా ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. వ్యవసాయ భూముల్లో సహజంగా ఉండే పోషక పదార్థాలతోపాటు అదనంగా సేంద్రియ ఎరువులు అందించి మొక్కలకు మరిన్ని పోషకాలు ఇవ్వగలిగితే అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులు నేలను కాపాడుకోవడానికి భూసార పరీక్షలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సుస్థిర దిగుబడులు పొందడానికి రైతులు రెండేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించుకుంటే ఎంతో మేలు. భూమిలో ఉండే పోషక పదార్థాలతోపాటు చౌడు గుణాలు, సున్నపు శాతం, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు భూసార పరీక్షలు దోహదపడతాయి.
రెండేళ్లకు ఒకసారి..
భూమిలో సారాన్ని తెలుసుకోవడానికి కనీసం రెండేళ్లకు ఒక్కసారైనా భూపార పరీక్షలు చేయించుకుంటే మంచింది. నేల సారవంతంగా ఉన్నప్పుడే అశించిన దిగుబడులు పొందవచ్చు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల నేల స్వభావాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. భూమిలో ఏ ధాతువులు లోపించాయో భూసార పరీక్షల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. భూమిలో ఉండే పోషక పదార్థాలే కాకుండా చౌడు గుణాలు, సున్నపు శాతం, నేల కాలుష్యం వంటి వాటిని గుర్తించేందుకు భూసార పరీక్షలు అత్యంత ఆవశ్యకం. పరీక్షల అనంతరం నిపుణుల సూచనల ప్రకారం పంటలు సాగు చేస్తే ఆశించిన మేర నాణ్యమైన దిగుబడులు సాధించొచ్చు.
మట్టి సేకరణలో జాగ్రత్తలు..
భూసార పరీక్షలు చేయించుకోవడానికి ముందుగా మట్టి సేకరణ గురించి తెలుసుకోవాల్సింది. మట్టి నమూనా సక్రమంగా లేకపోతే భౌతిక, రసాయనిక, జీవ లక్షణాల అంచనా సక్రమంగా ఉండదు. ఇటువంటి సమయంలో నిపుణుల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో పంట సమస్యలపై సరైన సిఫార్సులు అందుకోలేం. పెట్టుబడి ఖర్చులు సైతం పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తప్పవు. అందుకే మట్టి నమూనా సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
భూసార పరీక్షలతో నాణ్యమైన దిగుబడులు..
నేలలో భూసారం తెలుసుకోవడానికి రైతులు భూసార పరీక్షలు చేయించుకుంటే ఎంతో మేలు. తద్వారా నాణ్యమైన దిగుబడులను పొందడమే కాకుండా వృథా ఖర్చులను తగ్గించుకోవచ్చు. పంట పెట్టుబడిని తగ్గించుకోవడానికి భూసార పరీక్షలు ఉపయుక్తంగా ఉంటాయి. కనీసం రెండేళ్లకు ఒకసారి కచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల నేలకు అనుకూలమైన పంటలు సాగు చేసుకోవడానికి వీలుంటుంది. తదనుగుణంగా నిపుణుల సూచనలు పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందొచ్చు. భూసార పరీక్షలు చేయించుకోవడానికి మట్టి నమూనా సేకరణలోనూ రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
– అఫ్జల్బేగం, వ్యవసాయ సహాయ సంచాలకురాలు, అశ్వారావుపేట