చండ్రుగొండ, ఫిబ్రవరి 13: ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరిచినా విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హెచ్చరించిన ఘటన చండ్రుగొండ కేజీబీవీలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కేజీబీవీ హాస్టల్లో ఈ నెల 11(మంగళవారం) రాత్రి విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో పదో తరగతి చదువుతున్న కాకటి స్వశ్చిత, కాకటి గోపికల కాళ్లను ఎలుకలు కరిచాయి.
ఈ విషయాన్ని బుధవారం కేజీబీవీ స్పెషలాఫీసర్ కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె వారిద్దరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అంతేకాక ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పొద్దని ఆ విద్యార్థినులను హాస్టల్ అధికారులు హెచ్చరించారు. ఈ విషయం ఎలాగోలా వారి తల్లిదండ్రుల ద్వారా ఎంఈవో సత్యనారాయణకు గురువారం తెలిసింది. దీంతో ఆయన కేజీబీవీ హాస్టల్ను తనిఖీ చేశారు.
ఎలుకలు కరవడంతో గాయపడిన ఇద్దరు విద్యార్థినులను పరామర్శించారు. హాస్టల్లో ఎలుకలను అరికట్టడానికి ర్యాట్ గమ్ప్యాడ్లను వాడాలని స్పెషలాఫీర్ను ఆదేశించారు. ఇలాంటి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా.. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.