ఖమ్మం రూరల్: తాతల ధర్మాన కోటలు కడితే.. మనుమల పుణ్యాన ఉన్న కోటలను ఉడపీకినట్లు ఉన్నది ఎదులాపురం మున్సిపాలిటీ యంత్రాంగం తీరు. ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటుకు ముందు మొత్తం 12 పంచాయతీల్లో ఏడాది పొడవునా లక్షలాది మొక్కలు పెంపకం జోరుగా సాగేది. వానకాలం వచ్చిందంటే చాలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండానే స్వయంగా పెంచుకున్న మొక్కలను హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా నాటిన సంగతి తెలిసిందే. అయితే ఎదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు అయింది మొదలు హరిత సంకల్పానికి అధికార యంత్రాంగం తిలోదకాలు ఇచ్చింది.
దీంతో పదేళ్లపాటు పచ్చదనంతో కళకళాడిన నర్సరీలు ఆలనా పాలన లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.
ప్రతి గ్రామపంచాయతీలో ప్రత్యేకంగా షెడ్లు, మొక్కల పెంపకానికి అవసరమైన బోర్లు సమృద్ధిగా నీరు ఇలా అన్ని రకాల వసతులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేపట్టిన విధానం కావడంతోనే హరిత సంకల్పానికి అధికారులు తిరోధకాలు ఇచ్చారా అనే సందేహం మున్సిపల్ ప్రజల్లో వ్యక్తమవుతోంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి వేలాది మొక్కలు పురిటిలోనే మాడిపోయిన సందర్భాలు ఎక్కడపడితే అక్కడ కనబడుతున్నాయి. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అనేక చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా హరిత ప్రేమికుల సంకల్పం నెరవేరని పరిస్థితి కనపడుతుంది.
ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మొక్కల పెంపకం పై తగు సూచనలు చేస్తే వచ్చే వారం కాలం నాటికి అందుబాటులోకి మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ మొదటి పాలకవర్గ సమావేశం జరుగుతున్నందున సబ్బండ వర్గాల సమాజ శ్రేయస్సుకు ఎంతగానో దోహదం చేసే పచ్చదనం పెంపు పై చర్చ జరుగుతుందా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పట్ల యావత్ మున్సిపాలిటీ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.