భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ న్యూట్రీ కిట్ల పంపిణీలో గర్భిణులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్ నుంచి కేసీఆర్ న్యూట్రీ కిట్లు పంపిణీ కార్యక్రమంపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నందున అదేరోజు జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో న్యూట్రీ కిట్లు పంపిణీ చేపట్టే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు భద్రపర్చాలని ఆదేశించారు. జిల్లాలో 7,360 మంది గర్భిణులకు కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గర్భిణులకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు 80మందికి పంపిణీ చేయాలని, సబ్సెంటర్ల వారీగా రోజువారీ షెడ్యూల్ రూపొందించాలన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు న్యూట్రీ కిట్లు సంజీవినిగా పని చేస్తాయని అన్నారు. తహసీల్దార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లను పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో దయానందస్వామి, ఉప వైద్యాధికారి డాక్టర్ సుకృత, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుజాత, డాక్టర్ చేతన్, పీహెచ్సీల వైద్యాధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.