మాతాశిశు మరణాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అందులో భాగంగా గర్భిణులకు నూట్రీషన్ కిట్లు అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. అందులో భద్రాద్రి జిల్లా ఒకటి. జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కే్ంరద్రాలు, ఐదు యూపీహెచ్సీ, నాలుగు సీఎఫ్డబ్ల్యూసీ కే్రందాల్లో న్యూట్రీషన్ కిట్లను భద్రపరిచి వారం రోజుల్లో గర్భిణులకు అందించేలా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా సుమారు 7 వేల మందికి పైగా గర్భిణులకు ఈ కిట్లు అందజేయనున్నది.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): మాతా శిశు మరణాల నివారణకు రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. గర్భిణులకు నూట్రీషన్ కిట్లు అందజేయాలనే నిర్ణయం తీసుకున్నది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్కు ఎంపిక చేసింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. వారం రోజుల్లో గర్భిణులకు నూట్రీషన్ కిట్లు అందించేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కే్ంరద్రాలు, ఐదు యూపీహెచ్సీ, నాలుగు సీఎఫ్డబ్ల్యూసీ కేంద్రాల్లో న్యూట్రీషన్ కిట్లను భద్రపరుస్తున్నది. 102 వాహనాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నది. వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటికే జిల్లాలో ఎంతమంది గర్భిణులు ఉన్నారు.. వారికి ఎప్పుడు కిట్లు అందించాలి.. ఏ మాధ్యమం ద్వారా గ్రామాలకు చేరవేయాలి.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 7 వేల మందికిపైగా గర్భిణులకు కిట్లు అందనున్నట్లు ఓ అంచనా.
ఒక్కో పీహెచ్సీ నుంచి సుమారు 200 మందికి కిట్లు అందనున్నాయి. 13- 27 వారాల గర్భిణులకు మొదటి కిట్, 28- 34 వారాల గర్భిణులకు రెండో న్యూట్రీషన్ కిట్ అందిస్తారు. మొదటి కిట్ ఇచ్చిన నెల రోజుల తర్వాత రెండో కిట్ అందిస్తారు. దీనిలో భాగంగా వైద్యారోగ్యశాఖ ప్రతి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో 13- 27 వారాల గర్భిణులు, 28- 34 వారాల గర్భిణులు ఎంతమంది ఉన్నారనే విషయంపై లెక్కలు తీస్తున్నారు. ప్రతి గర్భిణికి కిట్లు అందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
ఒక్కో కిట్లో కిలో ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్, మూడు ఐరన్ సిరప్స్, ఖర్జూర ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్, ఆల్బెండజోల్ మాత్ర ఉంటాయి. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోప నివారణకు కిట్లు ఎంతగానో ఉపకరిస్తాయి. ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగేందుకు వీలుగా ఒక కప్ కూడా కిట్లో ఉంటుంది. గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు ఈ పోషకాహారం తోడ్పడుతుందని, పుట్టబోయే శిశువుల ఆరోగ్యమూ బాగుంటుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు నెలనెలా గర్భిణుల బరువు కొలుస్తున్నారు. ఆరోగ్యపరీక్షలు చేయిస్తున్నారు. రక్తహీనత లోపం ఉన్న గర్భిణులను గుర్తిస్తున్నారు. వారికి డబుల్ రేషన్ అందిస్తున్నారు. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. తల్లీబిడ్డల సంరక్షణను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సీడీపీవోలు, డీడబ్ల్యూవో సమీక్షిస్తున్నారు.
గర్భిణులకు న్యూట్రీషన్ కిట్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 13- 27 వారాలు, 28- 34 వారాల గర్భిణుల వివరాలు సేకరిస్తున్నాం. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సుమారు 200 మందికి పైగా కిట్స్ అందనున్నాయి. 13-27 వారాల గర్భిణులకు మొదటి కిట్, 28- 34 వారాల గర్భిణులకు రెండో కిట్స్ అందిస్తాం.
– డాక్టర్ సుజాత, మాతాశిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్, కొత్తగూడెం