ఖమ్మం వ్యవసాయం, మార్చి 1: ఆరుగాలం కష్టపడి పంటను పండించి మార్కెట్కు తీసుకొస్తే కనీస మద్దతు ధర లభించడం లేదని శుక్రవారం రైతులు కన్నెర్ర చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట ఈ మేరకు కొన్ని గంటల పాటు ధర్నా చేపట్టారు. తెలిసిన వివరాల ప్రకారం.. వారం రోజుల నుంచి ఖమ్మం ఏఎంసీకి జిల్లా నుంచే కాక భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి మిర్చి తరలివస్తున్నది. రోజుకు కనీసం 60 వేల బస్తాలు తగ్గడం లేదు. వ్యాపారులు ప్రతిరోజు ఉదయం నిర్వహించే జెండాపాటలో లేనిపోని సాకులు చెప్పి ధర తగ్గిస్తుండడం, జెండాపాటలో ఖరీదుదారుల పోటీ లేకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. కానీ చివరకు చేసేదేం లేక మార్కెట్ కమిటీ నిర్ణయానికి లోబడి మిర్చి విక్రయించారు. ఇదే కోవలో శుక్రవారం జెండాపాటలో మిర్చి క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.20,800గా పలికింది. జెండాపాటకు ఖరీదుదారులు ఎక్కువ మంది వస్తే పోటీ పెరిగి పంటకు మంచి ధర వస్తుంది. కానీ ఒకరిద్దరు ఖరీదుదారులు మాత్రమే జెండాపాటకు హాజరు కావడం, మరోవైపు కొందరు వ్యాపారుల గుమస్తాలు పంటకు ఏదో ఒక ధరకు పంటను కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. మిర్చి నాణ్యతను బట్టి ధర నిర్ణయించకుండా, అశాస్త్రీయంగా ధరలు నిర్ణయించడం సరికాదని మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఖమ్మం జిల్లా మంత్రులు, కలెక్టర్ వీపీ గౌతమ్ వెంటనే మార్కెట్కు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక దశలో మార్కెట్ యార్డు గేట్లను మూసి వేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఏఎంసీ సెక్రటరీ ప్రవీణ్కుమార్, జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి ఎంఏ అలీం, ఉద్యానశాఖ అధికారి రమణ, ఖమ్మం త్రీటౌన్ సీఐ రమేశ్ రైతుల వద్దకు వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ రంగంలోకి దిగారు. ఆయన స్వయంగా మార్కెట్లోకి వచ్చి మిర్చి నాణ్యతను పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మార్కెట్ కార్యాలయంలో వర్తక సంఘం సభ్యులు, మిర్చిశాఖ, దిగుమతి, ఉద్యాన, వ్యవసాయశాఖ, మార్కెట్ కమిటీ అధికారులతో సమావేశమయ్యారు. మిర్చి ధరలు, జెండా పాట నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. అదనపు కలెక్టర్ అనంతరం రైతు సంఘాల నాయకులతో చర్చించారు. పంట నాణ్యతను బట్టే క్రయ విక్రయాలు జరుగుతాయని, జెండాపాట నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని జెండా పాటకు ఖరీదుదారులందరూ వస్తారని ఆయన ప్రకటించడంతో రైతులు శాంతించారు. చర్చల తర్వాత యథావిధిగా క్రయ విక్రయాలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఖమ్మం ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.
ఏఎంసీ పరిధిలో పంట నాణ్యతకు అనుగుణంగా ధరలు లేవు. ఒకరోజు ధరలు తగ్గుతున్నాయి. మరోరోజు పెరుగుతున్నాయి. ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తే రైతులు ఎలా బతుకుతారు. అప్పూ సప్పూ చేసి పంటలు పండించి, నాణ్యమైన పంటను మార్కెట్కు తీసుకువస్తే ఇక్కడ వ్యాపారులు చౌక బేరాలు పెడుతున్నారు. దిక్కులేని పరిస్థితిలో రైతులు పంటను అమ్ముకుంటున్నారు. రైతుల బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఖమ్మం ఏఎంసీ పరిధిలో జెండాపాట కాకముందే వ్యాపారులు పంట కొనుగోళ్లను ప్రారంభించారు. జెండాపాట కాకముందే ఏ నిబంధనల ప్రకారం వ్యాపారులు పంటను కొంటారు. పైగా ఇష్టమైతే పంట అమ్ము.. లేదంటే తీసుకుపో.. అని బెదిరిస్తున్నారు. జెండా పాటలో క్వింటాల్ మిర్చి ధర రూ.20,800 పలికితే.. వ్యాపారులు నా పంటను చూసి నాణ్యతపై ఆ సాకు, ఈసాకు చెప్పి రూ.16 వేలు ధర నిర్ణయించారు. నేను మూడెకరాల్లో మిర్చి వేశాను. రూ.4 లక్షల పెట్టుబడి పెట్టాను. అంత చేస్తే 25 బస్తాల పంట మాత్రమే చేతికొచ్చింది. తీరా పంటను మార్కెట్కు తీసుకొస్తే ఇక్కడ తీసికట్టు ధరలు. ఇలా చేస్తే రైతులు చావాల్నా..? బతకాల్నా?
రెక్కలు ముక్కలు చేసుకుని నేను మిర్చి పండించాను. 34 బస్తాలు చేతికొస్తే వాటిని మార్కెట్కు తీసుకొచ్చాను. వ్యాపారులు నా పంటను చూసీచూడకుండానే క్వింటాకు రూ.15 వేల ధర నిర్ణయించారు. అదేంటి..? అని అడిగితే పట్టించుకునే నాథుడు లేడు. జెండాపాట పెట్టినప్పుడు వ్యాపారుల మధ్య పోటీ రావాలి కదా.. అదేం లేదు. ఒకరిద్దరు గుమస్తాలు వస్తే జెండాపాట జరుగుతుంటే మార్కెట్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎర్రటి ఎండలో నాలుగైదు గంటలు గొంతు పోయేలా మొత్తుకుంటే మా బాధలు వింటారా? రైతుల బాధ వినే నాథుడే లేరా..?