ఖమ్మం: ఖమ్మం స్ధానిక సంస్ధల నియోజకవర్గ ఎంఎల్సీ ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారంతో ముగిసింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్ కాంగ్రేస్ అభ్యర్ది గా రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర పంచాయితీరాజ్ చాంబర్ తరపున ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపిటిసిల సంఘం అధ్యక్షులు కల్లూరు మండలం పేరువంచ ఎంపిటిసి కొండపల్లి శ్రీనివాస్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణ పక్రియ ముగియడానికి రెండు రోజుల ముందు మాత్రమే రెండు ప్రధాన రాజకీయ పక్షాల నుంచి ఎంపిటిసిల సంఘం నుంచి నామినేషన్లు దాఖలు అయ్యాయి.
ఈనెల 24 వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వ తేదీవరకు గడువు. ఎంఎల్సి ఎన్నికలకు డిసెంబర్ 10 వ తేదీన పోలింగ్ జరుగనున్నది. టిఆర్ ఎస్ అభ్యర్ది తాతా మధుసూదన్ మంగళవారం సైతం మరో రెండు సెట్ల నామినేషన్లను రాష్ట్ర రైతుబంధు అధ్యక్షులు ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఎంఎల్ఏలు సండ్ర వెంకటవీరయ్య కందాల ఉపేందర్ రెడ్డి హరిప్రియా నాయక్ లతో కలసి దాఖలు చేశారు. కాగా ఈ సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ జడ్పి చైర్మన్ అంగోతు బిందు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం స్ధానిక సంస్దల శాసనమండలి నియోజకవర్గం నాలుగు జిల్లాలకు విస్తరించి ఉండడంతో స్దానిక సంస్దల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలంలో ఆయా ఆర్డిఓ కార్యాలయాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.