ఖమ్మం, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం కాంగ్రెస్లో నామినేట్ పదవుల రగడ తారస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్లో మొదటి నుంచీ ఉంటూ కష్టకాలంలో జెండా మోసిన తమకు మొండిచేయి చూపారంటూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవకాశాలు ఇవ్వకుండా విస్మరించారంటూ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్కు తరలివెళ్లారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రధాన అనుచరులుగా ఉన్న వారు అనేకమంది ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించడం విశేషం.
సీనియర్ కాంగ్రెస్ నాయకులను పార్టీ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా పార్టీలో విదేయత, సీనియారిటీకి అవకాశం ఇవ్వకుండా కొంతమంది నేతలు చెప్పిన వారికి, వారి అనుచరులకు పదవులు ఇస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. దీంతో కష్టకాలంలో పనిచేసిన నేతలు ఆందోళనకు గురవుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెంతోపాటు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి చాలా మంది కార్యకర్తలు శుక్రవారం ఉదయం తరలివెళ్లారు. రేణుకాచౌదరిని కలిసి పార్టీలో జరుగుతున్న పరిస్థితి చెప్పాలని, నామినేట్ పదవుల్లో కార్యకర్తలకు మొండిచేయి చూపుతున్న తీరును వివరించాలని భావించారు. రేణుకాచౌదరి హైదరాబాద్లో అందుబాటులో లేకపోవడంతో పీసీసీ కార్యాలయానికి వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను కలిసే ప్రయ త్నం చేశారు. ఆయన సైతం అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
తమకు జరిగిన అన్యాయం, జిల్లాలో కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకపోవడం వంటి అంశాలపై గాంధీభవన్లో ఆక్రోశం వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే తాము చేసిన అన్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లమైన తమకే ఈ తరహా మొండిచేయి చూపితే కార్యకర్తలకు తామేమి సమాధానం చెబుతామని కొందరు సీనియర్లు అంటున్నారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల వ్యవహారం.. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు తీరని వ్యథ మిగిల్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యాలయ ఇన్చార్జికి వినతిపత్రం అందజేశారు. భూక్యా బాషా, గుడిపూడి రామారావు, పమ్మిన నాగేశ్వరరావు, బండి వెంకన్న, దీప్లానాయక్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.