రామవరం, ఆగస్టు 1 : కొవిడ్ సమయంలో రైల్వేశాఖలో ఉన్న అన్ని రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కొవిడ్ సంక్లిష్ట పరిస్థితుల నుంచి జనం సాధారణ జీవితంలోకి రావడంతో రైల్వేశాఖ కొన్ని రాయితీలను పునరుద్ధరించింది. రైల్వే ప్రయాణంలో వృద్ధులకు ఇచ్చే రాయితీని మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ విధానంపై వృద్ధులు ఆగ్రహంతో ఊగిపోయారు.. రాయితీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పార్లమెంట్లో ఇటీవల కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ ఇచ్చే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తడంతో రైల్వేశాఖ తమ నిర్ణయాన్ని మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
వయోపరిమితి పెంపు ఆలోచన
కొవిడ్కు ముందు 58ఏండ్లు దాటిన మహిళలు, 60 ఏండ్లు దాటిన పురుషులకు రైల్వే టికెట్ల ధరలో రాయితీ వర్తించేది. మహిళలకు 50శాతం, పురుషులకు 40శాతం టికెట్టులో రాయితీ ఇచ్చేవారు. కాని ఇక నుంచి 70 ఏండ్లు దాటిన వారికి మాత్రమే రాయితీ ఇవ్వాలని రైల్వేశాఖ యోచిస్తున్నదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదీ కేవలం నాన్ ఏసీ తరగతులకు పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి సమీక్ష జరుగుతున్నదని పూర్తిస్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.
సీనియర్ సిటిజన్లకు రాయితీ కల్పించాలి
రైల్వే ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కరోనా వంకతో తీసివేసిన రైల్వేశాఖ పునరుద్ధరించమంటే కాకిలెక్కలు చెబుతున్నది. రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాలుగా నిర్ధారించిన ప్రభుత్వం రైల్వేలో సీనియర్ సిటిజన్స్కు మాత్రం 70సంవత్సరాలు విధించినట్లు వస్తున్న ప్రకటనలను వెనక్కు తీసుకోవాలి. గతంలో ఇచ్చిన మాదిరిగానే రాయితీ ఇవ్వాలి. కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు రాయితీలను ఇచ్చిన ప్రభుత్వం సాధారణ సీనియర్ సిటిజన్కు రాయితీ కల్పించలేదా?
– బందెల నర్సయ్య, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి,
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్
గతంలో ఇచ్చినట్లే ఇవ్వాలి..
గత ప్రభుత్వాలు పన్ను లు వేయలేదు.. 60 సంవత్సరాలు దాటినోళ్లకు రైళ్లలో టికెట్ల ధర లో రాయితీ ఇచ్చారు. కానీ ఈ మోదీ ప్రభుత్వం చాలారోజుల నుంచి టికెట్లలో తగ్గింపు ఇవ్వడం లేదు. పైగా ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంటేనే తగ్గిస్తారట. గిదేం పద్ధతి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడనుంచీ అన్నింటి ధరలు పెం చారు.. సామాన్యుడు బతకడం కష్టంగా ఉంది. గతం లో ఇచ్చినట్లే రైలు ప్రయాణంలో రాయితీ ఇవ్వాలి.
– ఎ.నాగమణి, రుద్రంపూర్ గృహిణి,
సీనియర్ సిటిజన్
వృద్ధులపై కనికరం చూపని కేంద్రప్రభుత్వం
రాబోయే రోజుల్లో సీనియర్ సిటిజన్ల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఆర్థిక, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి.. వారికి రాయితీ ఇవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. వారు తమ జీవితకాలంలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంతో చెల్లించారు. వయస్సు పైబడిన వారికి అవసరాలు ఉంటాయి.. కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. 70 ఏండ్లు పైబడిన వారితో పక్కన వచ్చేవారికి కూడా రైలు టికెట్టులో రాయితీ ఇవ్వాలి. స్త్రీలకు 55 సంవత్సరాలు, పురుషులకు 60 సంవత్సరాల నుంచి రాయితీ కల్పించాలి.
– కొదమసింహం పాండురంగాచార్యులు, కొవ్వూరు రైల్వే సాధన కమిటీ కన్వీనర్, సిటిజన్స్ వెల్ఫేర్ కమిటీ ప్రధాన కార్యదర్శి