ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 12: ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయ పాత భవనం శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం లైబ్రరీకి సెలవు కావడం, విద్యార్థులు, సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెలిసిన వివరాల ప్రకారం.. నగరంలోని పెవిలియన్ మైదానం పక్కనే 1957లో నాటి పాలకులు జిల్లా గ్రంథాలయ సముదాయాన్ని నిర్మించి ప్రారంభించారు. సముదాయంలో చైర్మన్ చాంబర్, రీడర్స్ గది, టాయిలెట్స్ ఉంటాయి. బిల్డింగ్ పాతదైపోవడంతో కాలం చెల్లిపోయి కూలిందని అధికారులు వెల్లడించారు.
నాటి నుంచి నేటి వరకు గ్రంథాలయంలో లక్షలాది మంది చదువుకున్నారు. నానాటికీ పాఠనాసక్తి తగ్గుతూ వస్తున్నప్పటికీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వందలాది మంది ప్రస్తుతం ప్రతిరోజూ గ్రంథాలయానికి వస్తారు. ఘటన జరిగిన సమయంలో కొత్త భవన సముదాయంలో సుమారు 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. భవనం కూలిన శబ్దం రావడంతో వీరంతా ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ సునీల్దత్తో కలిసి ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారం పాటు గ్రంథాలయ ప్రాంగణంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కూలిపోయిన బ్లాక్తోపాటు పక్కనే ఉన్న మరో పాత భవనాన్ని కూల్చి వాటిస్థానంలో నూతన భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాత భవనం కూలిన దృష్ట్యా కొత్త బ్లాక్ పటిష్ఠతపై ఇంజినీర్లతో అధ్యయనం చేయిస్తామన్నారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో గణేశ్, గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి ఉన్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని ఖమ్మం మేయర్ నీరజ సందర్శించారు. అక్కడి పరిస్థితులపై లైబ్రరీ అధికారులు, పోలీసులను ఆరా తీశారు.
ఘటనా స్థలాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. వారం రోజుల పాటు లైబ్రరీ సముదాయంలోకి ఎవరినీ అనుమతించరాదని హెచ్చరించారు. అలాగే జిల్లాలో పాతబడిన భవనాలన్నింటినీ వెంటనే కూల్చివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.