Public Park for Blind | పట్టణ, నగర సుందరీకరణకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన అనేక పథకాలను అమలు చేస్తూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నది. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలో ప్రత్యేకంగా అంధుల కోసం పార్కు నిర్మించి.. వాకింగ్ ట్రాక్, ఊయలలు, మ్యూజిక్ పరికరాలను సమకూర్చింది. త్వరలోనే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేతుల మీదుగా ప్రారంభించేలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖమ్మం, జూన్ 23 : తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పట్టణ, నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా నగరంలోని సుమారు 4 లక్షల మంది జనాభాకు అనుగుణంగా ఆహ్లాదాన్ని పంచేందుకు దాదాపు 50 పార్కుల వరకు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. చిన్న పిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు ఉపయోగించుకునేలా నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఆయా పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆట వస్తువులు, చెస్ బోర్డులు, క్రీడా ప్రాంగణాలు, ఫౌంటేన్లు ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని చర్చి కాంపౌండ్లో గల పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న పాకబండ పార్క్లో అంధుల కొరకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా అంధుల కొరకు పార్కు నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత.
1992లో అప్పటి మున్సిపాలిటీ పాలకవర్గం ఇక్కడ పార్కు నిర్మించింది. కాలక్రమేణా దానిని వినియోగించకపోవడం, అందులో సరైన సౌకర్యాలు, పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఆ పార్క్ అభివృద్ధి కోసం ఖమ్మం మునిపల్ కార్పొరేషన్ పాలకవర్గం రూ.29లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో పార్క్ స్వరూపమే మారిపోయింది. నూతన హంగులతో మురిసిపోతున్నది. పార్క్లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్ట్రన్స్ పార్క్, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇదే పార్క్లో అంధుల కొరకు ప్రతేక్య పరికరాలను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక మ్యూజికల్ పరికరాలను పార్క్లో అంధుల కొరకు ఏర్పాటు చేశారు. బాబెల్ డ్రమ్స్, కార్డెన్జా, ఫ్రీ చిమ్స్ సఫోరానో పెంటానిక్, కాంగస్ లాంటి పరికరాలను ఏర్పాటు చేశారు. ఆయా పరికరాలతో అంధులు తేలికగా మ్యూజిక్ను ఆనందించవచ్చు. ఇతర కర్రల సహకారంతో వాటిని వినియోగించుకునే వీలు కల్పించారు. ప్రత్యేక ఊయలలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో కూర్చొని ఊగుతున్నప్పుడు కిందపడిపోకుండా ఊయలకు అడ్డుగా కడ్డీని సైతం ఏర్పాటు చేశారు.
అంధుల కొరకు ప్రత్యేక వాకింగ్ ట్రాక్ను నిర్మించారు. వారు నడిచేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వాకింగ్ ట్రాక్పై టైల్స్ పరిచారు. కర్ర సాయంతో ముందుకు నడిచే అంధులకు నడక సులువుగా అర్థమయ్యేలా టైల్స్ మధ్య భాగంలో పొడవుగా ఉండే బుడెపలు(పటుత్వం కోసం) ఉన్న టైల్స్ను అమర్చారు. వాటినే అలర్ట్ టైల్స్ అంటారు. చేతిలో కర్ర, కాళ్లతో వాటిని తాకడం వల్ల అంధులు వాటిని తేలికగా అర్థం చేసుకునే వీలుగా అమర్చారు.
పార్కులో వృద్ధుల కొరకు పంచతంత్ర వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. ఇసుక, రాళ్లు, గడ్డి, కంకర, మట్టి విభాగాలను ఏర్పాటు చేశారు. వీటిలో నడిచే వృద్ధులు, ఇతర వయస్సుల వారికి కాళ్లలో రక్త ప్రసరణ తేలికగా అయ్యేలా ఉంటుంది. వాకింగ్ ట్రాక్ చుట్టూ కడ్డీలను ఏర్పాటు చేశారు. సీ-సా(రెండు వైపులా కూర్చొని పైకి కిందకు ఊగే పరికరం)ను కూడా పార్క్లో ఏర్పాటు చేశారు. మంచినీళ్ల పంపు, టేబుళ్లు, కుర్చీలు కూడా ఉన్నాయి. వీటికి తోడు దాతల సహాయంతో గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంధుల కోసం లిపిని కనుగొన్న లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని సైతం పార్క్లో ఏర్పాటు చేశారు. వీటిని త్వరలోనే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించేలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మా ప్రాంతంలో క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో అంధుల పాఠశాల ఉండేది. వారి ఇబ్బందులను కళ్లారా చూశాను. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి సూచనలతో మేయర్ పునుకొల్లు నీరజ సహకారంతో అంధుల పార్క్ను నిర్మించాం. అంధుల నుంచే కాకుండా ఇతర వర్గాల నుంచి కూడా ఆదరణ బాగుంది. కార్పొరేటర్గా చాలా తృప్తిగా ఉంది.
-ఎస్కే.మక్బుల్, 23వ డివిజన్ కార్పొరేటర్, ఖమ్మం