భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : జిల్లా ప్రొటోకాల్ పదవి ఉన్నా.. భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి నెలన్నర దాటినా ప్రభుత్వ వాహనం కేటాయించడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో జడ్పీ చైర్మన్గా ఉన్న కోరం కనకయ్య ఇల్లెందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్ 9న వైస్ చైర్మన్గా ఉన్న కంచర్ల చంద్రశేఖరరావుకు చైర్మన్గా బాధ్యతలు అప్పగించి ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ సీఈవో విద్యాలత, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయినా ప్రభుత్వ వాహనాన్ని ఇప్పటివరకు అప్పగించలేదు. పాత వాహనం ఖాళీగా ఉన్నా దానిని జడ్పీ కార్యాలయంలో పక్కన పెట్టారే తప్ప చైర్మన్కు అప్పగించడంలో వెనుకడుగు వేస్తున్నారు.
జడ్పీ చైర్మన్గా ఉన్న కోరం కనకయ్య రాజీనామా తర్వాత కొత్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కంచర్ల చంద్రశేఖరరావుకు గన్మెన్ కాదు కదా.. సర్కారు వాహనం కూడా దక్కనివ్వకుండా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. కొత్త సర్కారు రావడం.. ప్రస్తుతం ఉన్న చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడం వల్ల ప్రభుత్వ వాహనం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక గతంలో ఉన్న క్యాంపు ఆఫీస్ సైతం అప్పగించకపోవడం కొసమెరుపు. దీంతో జడ్పీ చైర్మన్ సొంత వాహనంలోనే కార్యాలయానికి వెళ్తున్నారు. జిల్లాలో అధికారుల పర్యటనకు కూడా సొంత వాహనంపైనే వెళ్లాల్సి వస్తోంది. దీనిపై జడ్పీ సీఈవో విద్యాలతను వివరణ కోరగా.. చైర్మన్కు వాహన కేటాయింపు విషయంలో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదన్నారు. పై నుంచి ఆదేశాలు వస్తే తప్పక కేటాయిస్తామన్నారు. గన్మెన్ కేటాయింపు విషయం నాకు తెలియదని ఆమె వివరించారు.