ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే7: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ‘నీట్’ ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగింది. ఖమ్మం నగర పరిధిలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,118 మంది విద్యార్థులకు గాను 29 మంది గైర్హాజరయ్యారు. హార్వెస్ట్ పాఠశాల కేంద్రంలో 1,678 మందికి 1,600 మంది, బ్లూమింగ్ మైండ్స్ పాఠశాలలో 432 మందికి 426 మంది, వీవీసీ పాఠశాలలో 432 మందికి 427 మంది, కవిత మెమోరియల్ కళాశాల కేంద్రంలో 355 మందికి 355 మంది, మ్యాక్స్ కళాశాల కేంద్రంలో 216 మందికి 211 మంది హాజరయ్యారు. భద్రాద్రి జిల్లాలో పరీక్ష కోసం రెండు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
కేంద్రాల పరిధిలో 1,080 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సుండగా 19 మంది గైర్హాజరయ్యారు. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో 480 మందికి 469 మంది హాజరయ్యారు. పాల్వంచలోని కేటీపీఎస్ డీఏవీ స్కూల్ కేంద్రంలో 600 మందికి 592 మంది హాజరయ్యారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులు కేంద్రాలకు ఆలస్యంగా వచ్చి వెనుదిరిగారు. నిర్వాహకులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ దఫా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన బాక్స్లకు డిజిటల్ లాకింగ్ సిస్టమ్ అమర్చారు. చిన్న లోపాలైనా లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష గదిలో ఎన్టీఏ సమకూర్చిన గోడ గడియారాలు అమర్చారు.
పరీక్షా కేంద్రాల పరిశీలన..
ఎన్టీఏ ఫ్లయింగ్ స్కాడ్స్గా ఇద్దరు మాజీ సైనికాధికారులు, నీట్ ఖమ్మం కో-ఆర్డినేటర్ పార్వతీరెడ్డి, కొత్తగూడెం జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి కేంద్రాల్లోకి విద్యార్థులను సిబ్బంది అనుమతించారు. మెటల్ డిటెక్టర్లతో విద్యార్థులను తనిఖీ చేశారు. బాలికలు చెవి దుద్దులు, పట్టీలు, షూస్ తీసి కేంద్రాల్లోకి వచ్చారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు లోపలికి వచ్చే సమయం నుంచే నిర్వాహకులు వీడియో రికార్డింగ్ ప్రారంభించారు. ఒకటి రెండు సెంటర్లలో రెండు కెమెరాలు వినియోగించారు. పరీక్షా గదుల్లోనూ వీడియో రికార్డింగ్ కొనసాగింది.
పరీక్ష రాసిన తండ్రీ తనయ..
ఖమ్మం నగరానికి చెందిన సతీశ్బాబు, అతడి కుమార్తె జోషిక స్వప్నిక ఇద్దరూ నీట్ పరీక్ష రాశారు. తండ్రి వయస్సు 49 ఏళ్లు కాగా కుమార్తె వయస్సు 17 ఏళ్లు. తండ్రి పరీక్షా కేంద్రం హార్వెస్ట్ పాఠశాల కాగా కుమార్తె పరీక్షా కేంద్రం బ్లూమింగ్ మైండ్స్ పాఠశాల. సుమారు ఐదు పదుల వయస్సులోనూ మెడికల్ సీటు కోసం కుమార్తెతో పోటీ పరీక్ష రాసిన సతీశ్కుమార్ను పలువురు అభినందించారు.