త్తుపల్లి, సెప్టెంబర్ 21 : సత్తుపల్లి బస్టాండ్ దగ్గరలో జీప్లస్-1 తరహాలో ఆధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించతలపెట్టారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు, పత్రికలను ఇందులో అందుబాటులో ఉంచనున్నారు. రెండంతస్తులతో నిర్మించే ఈ భవన నిర్మాణంలో రీడింగ్ రూమ్, కంప్యూటర్ రూమ్, లైబ్రేరియన్ రూమ్, వాష్రూమ్స్, అధునాతనమైన హాల్, కంప్యూటరైజ్డ్ సిస్టమ్తోపాటు విద్యార్థులు, నిరుద్యోగులు కూర్చునేందుకు విశ్రాంతి గది నిర్మిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్, అందమైన గార్డెనింగ్తో గ్రంథాలయ ఆవరణను ముస్తాబు చేయనున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికే కాకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే, నైపుణ్యాలను పెంపొందించుకునే వారికి కూడా ఇది ఉపయోగపడనున్నది.
డిజిటల్ లైబ్రరీ…
డిజిటల్ లైబ్రరీ కూడా కావడంతో స్థానికంగా వివిధ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి ఇక్కడి నుంచి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు, గ్రూప్స్, బ్యాంక్ జాబ్స్, రైల్వే, ఇతర రంగాల్లో ఉద్యోగాల కోసం చూసేవారికి నాలెడ్జ్ హబ్గా ఈ గ్రంథాలయం మారనున్నది. పూర్తిస్థాయి కంప్యూటరైజేషన్తో నిర్మించే ఈ లైబ్రరీలో వందేళ్ల వరకు పూర్తిస్థాయి సేవలు ఉండేలా నిర్మించనున్నారు. ఈ లైబ్రరీని నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు కూడా అనుసంధానం చేయనున్నారు. గతంలో పట్టణంలోని పాతసెంటర్లో ఇరుకు గదిలో గ్రంథాలయం ఉన్నప్పటికీ బస్టాండ్, కళాశాలలకు దూరం కావడం, ఇరుకు గదులు ఉండడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బస్టాండ్ సమీపంలో రెవెన్యూ గెస్ట్హౌస్ స్థలాన్ని ప్రభుత్వ ఆదేశాలతో గ్రంథాలయ భవనానికి కేటాయించడంతో బస్టాండ్ పక్కనే విశాలమైన స్థలంలో ఈ గ్రంథాలయ నిర్మాణం చేపట్టారు. బస్టాండ్కు దగ్గరగా ఉండడం, వివిధ కళాశాలలు, పాఠశాలలు సైతం సమీపంలోనే ఉండడంతో ఈ గ్రంథాలయ నిర్మాణం పూర్తయితే విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. డిసెంబర్ నాటికి ఈ భవనాన్ని పూర్తిచేసి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు వరం
విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా నా విజ్ఞప్తి మేరకు ఎంపీ బండి పార్థసారథిరెడ్డి సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మించతలపెట్టారు. దీనిని త్వరితగతిన పూర్తిచేసి మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తాం. విద్యార్థులు, నిరుద్యోగులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే, సత్తుపల్లి
అత్యాధునిక హంగులతో లైబ్రరీ
సత్తుపల్లి పట్టణంలో ఎంపీ బండి పార్థసారథిరెడ్డి సహకారంతో అత్యాధునిక లైబ్రరీ భవనాన్ని నా హయాంలో నిర్మించడం సంతోషంగా ఉంది. జిల్లాలోనే ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక హంగులతో భవనాన్ని పూర్తిచేసి యువత, నిరుద్యోగులు, విద్యార్థులకు అందిస్తాం. ప్రతిఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకుంటే ‘బండి’ ఆశయం నెరవేరుతుంది.
– కొత్తూరు ఉమామహేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
సత్తుపల్లికి మణిహారం గ్రంథాలయం
బస్టాండ్ దగ్గరలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఈ గ్రంథాలయం సత్తుపల్లికి మరో మణిహారం అవుతుంది. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, వివిధ రకాల పత్రికలు చదువుకునేందుకు ఈ గ్రంథాలయం ఉపయోగపడనున్నది. ఎంపీ పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే సండ్రకు కృతజ్ఞతలు
– కూసంపూడి మహేశ్, మున్సిపల్ చైర్మన్, సత్తుపల్లి