నమస్తే నెట్వర్క్ ; విఘ్నాలు తొలగించే వినాయకుడు.. వరాలు కురిపించే గణనాథుడిని ఉమ్మడి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన మండపాలకు మేళతాళాల నడుమ జై భోళో గణేశ్ మహారాజ్ కీ జై.. జైజై గణేశా.. అంటూ నినాదాలు చేస్తూ సోమవారం తరలించిన నిర్వాహకులు, భక్తులు, స్వామి మాలధారులు, మహిళలు కుటుంబ సమేతంగా పూజారుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ప్రతిష్ఠించారు. పత్రి, పూలు, పండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, పులిహోర, వడలతో నైవేద్యాన్ని సమర్పించి.. దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా& ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య.. అంటూ భక్తిభావంతో పాటలు పాడుతూ స్వామివారిని కొలిచారు. సాయంత్రం వినాయకుడి మండపాల వద్ద పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈసారి ఊరూ.. వాడా మట్టి విగ్రహాలను ఎక్కువగా ప్రతిష్ఠించారు. కొందరు మట్టి విగ్రహాలను జిల్లా కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేశారు.
వీధులన్నీ వక్రతుండ నాథాలతో మార్మోగుతున్నాయి. వాడలన్నీ ఏకదంతుడి కీర్తనలతో హోరెత్తిపోతున్నాయి. ‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా.. దయుంచయ్యా దేవా..’ అంటూ భక్తి గీతాలు వీనులవందు చేస్తున్నాయి. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో గణపయ్యను కొలువుదీర్చారు. తొలుత పసుపు వినాయకుడి పూజతో ప్రారంభించి, అథాంగ పూజ, శోడషోపచార పూజలు, వినాయక వ్రత కల్పం, వినాయక కథలతో శాస్ర్తోక్తంగా పూజా క్రతువును నిర్వహించారు. 21 పత్రులతో పూజలు చేసి, ఉండ్రాళ్లు, కుడుములు, పరమాన్నం, పులిహోర, అప్పాలు, పానకాలతో నైవేద్యాన్ని సమర్పించారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో పార్వతీపుత్రుడికి పూజలు చేశారు.