భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆయన వృత్తిపరంగా వైద్యుడు. ప్రజావైద్యుడిగా ఆయనకు భద్రాచలం నియోజకవర్గవ్యాప్తంగా పేరున్నది. వైద్యుడిగా అంతా బాగా నడుస్తున్నా, ఏ బాదరబంధీ లేకపోయినా ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలనుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసినా మొక్కవోని సంకల్పంతో ప్రజాసమస్యల పరిష్కారంపై పనిచేస్తున్నారు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ నుంచి సీటు సాధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ఆయన సోమవారం ‘నమస్తే’తో ముచ్చటించారు. ఎన్నికల్లో భద్రాచలం నుంచి గెలిచేది బీఆర్ఎస్సేనని, ఇక్కడ గులాబీ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తెల్లం: నియోజకవర్గమంతా గిరిజన ప్రాంతమే. గ్రామాలన్నీ నాకు కొట్టిన పిండి. వైద్యుడిగా వేలాది మంది గిరిజనులకు నేను వైద్యసేవలందించాను. వారికి సేవ చేసేందుకు రాజకీయ క్షేత్రంలోకి అడుగు పెట్టాను. గత ఎన్నికల్లో ఓటమి నన్ను ప్రభావితం చేయలేదు. ఈసారి ప్రజలు నన్ను గెలిపిస్తారు. ఊరూరా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాను. ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో మాకు బాగా కలిసి వచ్చింది. పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది.
తెల్లం: గోదావరి వరద ముప్పు గురించి నేను గతంలోనే సీఎం కేసీఆర్ దృష్టి తీసుకెళ్లాను. సమస్యపై కేసీఆర్కు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ఆయన సానుకూలంగా స్పందించారు. భద్రాచలంలో కరకట్ట నిర్మాణానికి రూ.40 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంత్రి అజయ్కుమార్ ఇటీవల పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో గెలిచాక కరకట్ట పనులను వేగవంతం చేసి పూర్తి చేసేందుకు కృషి చేస్తాను. పనులకు మరో రూ.15 కోట్ల నిధులు విడుదల చేయించాను.
తెల్లం: గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు ప్రజలకు ఏమీ చేయలేదు. నియోజకవర్గం అభివృద్ధి పరంగా వెనుకబాటుకు కారణం వాళ్లే. ప్రజలు ఈసారి బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారని నా నమ్మకం. నేను లోకల్ వ్యక్తిని. మాది దుమ్ముగూడెం మండలం. ప్రజల వైద్యుడిగా నాకు నియోజకవర్గవ్యాప్తంగా పేరున్నది. ప్రజలు నన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
తెల్లం: గతంలో భద్రాచలం నియోజకవర్గం చాలాపెద్దది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు సాకు చూపి కేంద్రం అన్యాయంగా కొన్ని మండలాలు, కొన్ని పంచాయతీలను ఆంధ్రాలో కలిపింది. నేను ఎన్నికల్లోగెలిస్తే ఆ మండలాలు, పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపించేందుకు కృషిచేస్తాను.
తెల్లం: ఎన్నికల్లో గెలిచేది నేనే. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేదీ నేనే. నీటి వనరులను గుర్తించి పంటలకు సాగునీటి వసతి కల్పించేందుకు కృషి చేస్తాను. భద్రచలానికి ఇప్పటివరకు ఆధ్యాత్మిక స్థలంగానే పేరున్నది. నేను ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాను. సీతమ్మ బరాజ్ పనులు సజావుగా సాగేందుకు శాయశక్తులా పనిచేస్తాను.