నల్లగొండ ప్రతినిధి, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. నల్లగొండలోని ఐటీ హబ్ వెనకాల ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా మండలి ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా కొనసాగనుంది.
ఓటింగ్లో ప్రాధాన్యతా ప్రకారం ఓటర్లు ఓటు వేయగా.. కౌంటింగ్ కూడా అదే విధంగా చేపడతారు. ముందుగా పోలైన బ్యాలెట్లన్నింటినీ కట్టలుగా కట్టి తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్లను మొదలు లెక్కిస్తారు. ఆ సమయంలోనే చెల్లని ఓట్లను పక్కకు వేస్తారు. చెల్లిన ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ విజేతకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లల్లో యాభై శాతం ప్లస్ ఒకటి కలిపి విజేతకు అవసరమైన గెలుపు కోటాను నిర్ధారిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఈ గెలుపు కోటాను అభ్యర్థులు సాధిస్తే సరేసరి. లేకుంటే ఎలిమినేషన్ పద్ధతిలో సుధీర్ఘంగా గెలుపు కోటా వచ్చే వరకు లెక్కింపు కొనసాగనుంది.
ఓట్ల లెక్కింపు సరిగ్గా రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం 6 గంటలకే ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు అంతా లెక్కింపు కేంద్రానికి చేరుకోనున్నారు. వీరి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సీరియల్ ప్రకారంగా కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్స్లను తరలిస్తారు. అయితే ఓట్ల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే కౌంటింగ్ హాల్ను సిద్ధం చేశారు. ఇందులో ఓట్ల లెక్కింపు కోసం 25 కౌంటింగ్ టేబుళ్లను, ఒక రిటర్నింగ్ అధికారి టేబుల్ను ఏర్పాటు చేశారు.
మొత్తం 200 పోలింగ్ కేంద్రాల్లో కేంద్రానికి ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కన మొత్తం 200 బ్యాలెట్ బాక్స్లను పోలింగ్ కోసం వినియోగించారు. అయితే వీటిని పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ప్రకారంగా ఒక్కో కౌంటింగ్ టేబుల్కు ఒక బ్యాలెట్ బాక్స్ను అందజేస్తారు. ఇలా ఒక్కో రౌండ్లో 25 టేబుళ్లపై 25 బ్యాలెట్ బాక్స్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కడతారు. ఇలా ఒక్కో రౌండ్లో 25 అంటే.. మొత్తం 200 బాక్స్లు పూర్తి కావాలంటే 8 రౌండ్లలో కట్టలు కట్టే కార్యక్రమం కొనసాగనుంది.
ఎప్పటికప్పుడు వీటిన్నింటినీ తీసుకెళ్లి ఆర్ఓ టేబుల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రమ్లో వేస్తారు. ఇలా బండిల్ కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక అసలు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. అయితే బండిల్ కార్యక్రమానికే కనీసం మూడు గంటల సమయం పట్టవచ్చని అంచనా. ఉదయం 11 గంటల వరకు ఇది పూర్తైతే ఆ తర్వాతే అసలు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు.
అనుకున్న విధంగా ఉదయం 11 గంటల వరకు కట్టలు కట్టే ప్రక్రియ ముగిస్తే.. తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే ఒక్కో టేబుల్కు 40 బండిల్స్ చొప్పున ఇస్తూ వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ఇలా మొత్తం 25 టేబుళ్లపై ఒక్క రౌండ్లోనే పోలైన 24,139 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదే సమయంలో చెల్లని ఓట్లను సైతం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్లో వేస్తారు.
ఇలా ఇది పూర్తి కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకోవచ్చని అంచనా. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటల వరకు పూర్తి కావచ్చు. ఇది పూర్తయ్యాక చెల్లని ఓట్ల లెక్క తేల్చి మొత్తం చెల్లిన ఓట్లలో 50 శాతం+1ను గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు.. మొత్తం ఓట్లలో 24 వేల ఓట్లు చెల్లుబాటైతే.. అందులో సగం అంటే 12,000+1=12,001 ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్ధికి గెలుపు కోటా రాకపోతే అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
ఎలిమినేషన్ ప్రక్రియలో విభిన్నంగా కొనసాగనుంది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే సమయంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికైతే తక్కువ తొలి ప్రాధాన్యతా ఓట్లు వస్తాయో.. వారి ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను ముందుగా లెక్కించి ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. తొలి ఓట్లలో చివరి స్థానంలో నిలిచిన అభ్యర్థికి పోలైన ద్వితీయ ఓట్లు.. ఏ అభ్యర్థులు పొందినవి వారికి కేటాయిస్తారు. ఇంకా కూడా కోటా రాకపోతే చివరికి తక్కువ తొలి ప్రాధాన్యత వచ్చిన రెండో అభ్యర్థికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుని మిగతా వారికి పంచేస్తారు.
ఆయా అభ్యర్థుల తొలి ప్రాధాన్యత ఓట్లకు ఎలిమినేషన్ ప్రక్రియలో వస్తున్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కులుపుకుంటూ ముందుకు వెళతారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గెలుపు కోటా వచ్చే వరకు కింది నుంచి పైకి అందరి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ వెళ్తారు. ఈ క్రమంలో ఎక్కడైనా ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే తృతీయ ప్రాధాన్యతా ఓట్లను కూడా లెక్కించక తప్పదు. అయితే కిందటి సారి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి గెలుపు కోటా ఓట్లకు కేవలం 38 ఓట్ల దూరంలో నిలిచిపోయారు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తుది ఫలితం వెల్లడైంది.
అయితే ఈ సారి ఫలితం తేలడానికి ఎక్కువ సమయమే తీసుకోవచ్చని అంచనా. ప్రధాన అభ్యర్థుల్లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, టీచర్స్ జాక్ అభ్యర్థి పూల రవీందర్, బీజేపీ అభ్యర్థి సర్వోత్తంరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, కుడా మాజీ చైర్మన్ సుందరరాజులు తమకు భారీగానే ఓట్లు పోలైనట్లు అంచనా వేస్తూ విజయంపై ధీమాను ప్రదర్శిస్తున్నారు. నిజంగానే వీరి అంచనా ప్రకారం ఓట్లు వీరికి పోటాపోటీగా పోలైతే ఫలితం అంత ఈజీగా తేలకపోవచ్చు. అంటే ఎవరికీ కూడా గెలుపు కోటా చేరుకోవడం అంత సులభం కాకపోవచ్చు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎలిమినేషన్ రౌండ్ కూడా సుధీర్ఘంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆరుగురిలో నలుగురు అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తే తప్ప తుది ఫలితం వెల్లడికాకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే తుది ఫలితం వెలువడే సరికి సోమవారం రాత్రి కావచ్చని కూడా భావిస్తున్నారు.