భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 29 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల విధుల కోసం ఎంపికైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో జరిగే ఈ శిక్షణ తరగతులకు ఆ సిబ్బంది తప్పక హాజరుకావాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా సిబ్బందికి ఆయా కేంద్రాలను కేటాయించినట్లు చెప్పారు. భద్రాచలం నియోజకవర్గ సిబ్బందికి పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, పినపాక నియోజకవర్గ సిబ్బందికి పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజీలో, అశ్వారావుపేట నియోజకవర్గ సిబ్బందికి పాల్వంచలోని కేటీపీఎస్ డీఏవీ పాఠశాలలో, కొత్తగూడెం నియోజకవర్గ సిబ్బందికి స్థానిక మహిళా డిగ్రీ కాలేజీలో, ఇల్లెందు నియోజకవర్గ సిబ్బందికి రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు.
శిక్షణ కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12లో విధిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్డర్ కాపీ, ఎపిక్ కార్డు జిరాక్సులతో హాజరుకావాలన్నారు. సిబ్బంది స్వీకరించిన ఫోన్ మెసేజ్లో ఏవైనా కరెక్షన్లు ఉంటే శిక్షణ కేంద్రంలో సంబంధిత అధికారులకు తెలియజేసి సరిచేసుకునే వీలు ఉందని అన్నారు. విధులు కేటాయించిన సిబ్బందికి ఆయా కేంద్రాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని అన్నారు. నిర్ణీత సమయంలో హాజరుకావాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.