మామిళ్లగూడెం, డిసెంబర్ 8: విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థలో డాటాను పూరించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఏకీకృత సమాచార వ్యవస్థ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) డాటా నమోదుపై జిల్లా అధికారులు, ప్రిన్సిపాళ్లు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారంపై ఏటా ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థలో సమాచారం నమోదు చేసేందుకు ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ డాటా నమోదుతో జిల్లాలోని విద్యా వ్యవస్థ పూర్తిగా తెలుస్తుందన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఎన్ని పాఠశాలల్లో ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో, ఇంకా ఏ సౌకర్యాలు చేయాల్సి ఉందో, ఎంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారో అనే విషయాలు తెలుస్తాయని వివరించారు. ఈ సందర్భంగా యూ డైస్ డాటా క్యాప్చర్ ఫార్మేట్పై అధికారులు, ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ బీ.సత్యప్రసాద్, డీఈవో సోమశేఖరశర్మ, వివిధ శాఖల అధికారులు కే.సత్యనారాయణ, మహమూది, జ్యోతి, సుమ, విద్యాచందన, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పరీక్షల సంఖ్యను పెంచి డెంగీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. డెంగీ నియంత్రణ చర్యలపై కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ సంవత్సరం 1 జనవరి నుంచి ఇప్పటి వరకు 27,771 పరీక్షలు చేపట్టగా.. 505 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. గడిచిన మూడు వారాల్లో 62 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో జిల్లాకు చెందిన వారు 40 మంది ఉండగా, ఇతర ప్రాంతాల వారు 22 మంది ఉన్నట్లు వివరించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో పకడ్బందీగా డ్రై డే కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, మధుసూదన్నాయక్, వివిధ శాఖల అధికారులు మాలతి, రాజేశ్వరరావు, వీవీ అప్పారావు, సోమశేఖరశర్మ, హరికిషన్, కే.సత్యనారాయణ, జ్యోతి, విజయలక్ష్మి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకంలో మంజూరైన అంగన్వాడీ టాయిలెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై ఆయా మండలాల ఎంపీడీవోలతో కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 114 అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల నిర్మాణానికి రూ.46 లక్షలను మెటీరియల్ కాంపోనెంట్ కింద అడ్వాన్స్గా విడుదల చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 8: 2024-25 విద్యా సంవత్సరంలో ఆలిండియా సైనిక్ స్కూల్లో ప్రవేశానికి విద్యార్థులు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.