భద్రాచలం, డిసెంబర్ 12 : భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణం, మిథిలా ప్రాంగణంలో చాందినీ వస్ర్తాలతో షామియానాలు, వెదురు తడికలతో పందిళ్లు వేశారు. గోపురానికి, ఆలయం చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చగా ఇల వైకుంఠపురంగా పట్టణం మారిపోయింది. అధ్యయనోత్సవాల్లో భాగంగా నిత్యం స్వామివారికి జరిపే నిత్య కల్యాణాన్ని బుధవారం నుంచి 23 వరకు(పది రోజులపాటు) నిలిపివేస్తున్నారు. ఈ నెల 22న సీతారాములు జలవిహారం చేయనున్నారు. 23న భక్తులంతా ఆసక్తిగా ఎదురుచూసే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్వామివారు వేంచేసే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సంగీతం, కూచిపూడి నృత్యాలు, హరికథ, నాటకాలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు భక్తులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
అధ్యయనోత్సవాల సందర్భంగా దశవతారాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి రామయ్య తొలుత మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రళయకాలమున నిద్రలో ఉన్న బ్రహ్మ వద్ద వేదాలను అపహరించి సముద్రంలో దాగున్న సోమాసురుడనే దానవుడిని వధించి, తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించేందుకు శ్రీమహా విష్ణువు మత్స్యావతారాన్ని ధరించారు. అలాగే కల్పాంతంలో సప్త రుషులు మనువు సృష్టికి సంబంధించిన ఔషధాలున్న నావను తన కొమ్ముకు కట్టుకొని ప్రళయం నుంచి సమస్త లోకాన్ని కాపాడిన సందర్భంలో శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించినట్లుగా పురాణాల వల్ల తెలుస్తోంది.