ఖమ్మం : ఖమ్మం నగరానికి చెందిన మిసెస్ ఇండియా మహ్మద్ ఫర్హా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ప్రపంచ మానవ హక్కుల రక్షణ కమిషన్ (డబ్యుహెచ్ఆర్సీ) ఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐసి)లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు డాక్టరేట్ను ప్రదానం చేశారు. మహిళా సాధికారత కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఫర్హాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
దీంతో పాటు వరల్డ్ హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో సభ్యత్వం కల్పించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డాక్టరేట్ను ఆమోదించగా, ప్రముఖ సామాజిక వేత్త మేధాపాట్కర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి దేశాయ్ జ్యోతిక, ప్రొఫెసర్ డీపీ మిశ్రా, గోవా మాజీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సార్డిన్హా, డబ్యుహెచ్ఆర్సి అంతర్జాతీయ డైరక్టర్ డాక్టర్ అభిన్నహోటా, చైర్మన్ తపన్ కుమార్, కార్యదర్శి మాక్సిమ్ సెంగియువాల సమక్షంలో ఫర్హాకు డాక్టరేట్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఫర్హా మాట్లాడుతూ.. మిసెస్ ఇండియా విజేతగా సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో చేస్తున్న మహిళా సాధికారత కార్యక్రమాలు ఎంతో గుర్తింపుతెచ్చాయన్నారు. ఈ డాక్టరేట్తో సమాజం పట్ల తనకు మరింత బాధ్యత పెరిగిందని, రెట్టింపు ఉత్సాహంతో సేవా రంగానికి అంకితమవుతానని ఆమె తెలిపారు. ఫర్హా గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.