భద్రాద్రి కొత్తగూడెం, మే 25 (నమస్తే తెలంగాణ) : బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బ్యాలెట్ పేపర్పై సీరియల్ నంబర్ 3కు ఎదురుగా మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాల్సిందిగా పట్టభద్రులకు అవగాహన కల్పించాలన్నారు.
ఉచిత హామీలు ఇచ్చే మోసగాళ్లను తరిమికొట్టాలని, గారడీ మాటలతో ప్రజలను మోసం చేస్తున్న వారికి పట్టభద్రులు తమ ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల గురించి వివరించాలన్నారు. విద్యావంతుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, హరిప్రియానాయక్, దిండిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.