ఖమ్మం:సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలకు సంబంధించి 2018 ఏప్రిల్4 న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని తూచ తప్పకుండా సకాలంలో అమలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఐటీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాజ్పుత్ను కోరారు. గురువారం ఎంపీ నామ ఐటీసీ వైస్ ప్రెసిడెంట్తో ప్రత్యేకంగా ఢీల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నామ మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
గతంలో రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. టన్నుకు కనీస మద్దతు ధర రూ..6,500 వరకు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచే ముడి కర్రను కొనుగోలు చేయాలని కోరారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని ఎంపీ నామ ఐటీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్కు తెలిపారు.