తిరుమలాయపాలెం, మార్చి 18 : వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో టీకాల కోసం బాలింతలు చంటి పిల్లలతో పడిగాపులు కాసిన ఘటన తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు హెల్త్ సబ్ సెంటర్లో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమ చిన్నారులకు టీకాలు వేయించేందుకు తల్లులు హెల్త్ సబ్ సెంటర్ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు. అక్కడ టీకాలు వేసేందుకు మొదటి ఏఎన్ఎం సరోజినిని అధికారులు నియమించారు. అయితే ఆమెకు కళ్ల మసకలతోపాటు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అఖిల అనే గర్భిణికి ఇంజక్షన్ వేస్తుండగా సిరంజీ విరిగిపోయింది. దీంతో చిన్న పిల్లలకు టీకాలు వేస్తానన్నా మిగతా తల్లులు అందుకు ఒప్పుకోలేదు.
ఈ విషయాన్ని కొందరు తల్లులు డీఎంహెచ్వో రామారావుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే పిండిప్రోలు పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సెకండ్ ఏఎన్ఎం ధనమ్మను టీకాలు వేయడానికి వెళ్లాలని ఆదేశించారు. అయితే దీనికి ఆమె నిరాకరించింది. అప్పటికే మధ్యాహ్నం 12:30 గంటలు అవుతున్నా బాలింతలు అక్కడే నిరీక్షించారు. అనంతరం అధికారులు కొక్కెరేణి ఏఎన్ఎంను పిలిపించి చిన్నారులకు టీకాల ప్రక్రియను పూర్తి చేశారు.
ఆరోగ్య ఉప కేంద్రం వద్ద టీకాలు వేసేందుకు సరైన ఏఎన్ఎంను ఎందుకు నియమించలేదని పలువురు బాలింతలు పీహెచ్సీ వైద్యాధికారి అవినాశ్ను ప్రశ్నించారు. ఇద్దరు ఏఎన్ఎంల మధ్య సమన్వయ లోపం వల్ల సమస్య వస్తోందని తెలిపారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఈ ఒక్కసారి కాదని, ప్రతీ వారం ఇదే పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు తెలిపారు. మంత్రి పొంగులేటి ఇలాకాలోనే ఇలా ఉంటే.. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడున్న బాలింతలు చర్చించుకుంటున్నారు.