కూసుమంచి, ఫిబ్రవరి 8 : పాలేరు జలాశయం కింద ఇప్పటికే ఉన్న సాగునీటి కష్టాలకు.. ఇప్పుడు తాగునీటి ఇబ్బందులూ తోడయ్యాయి. మొత్తంగా తాగునీటికైతే గడ్డుకాలం తప్పేలాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లడంతో నీటి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ఎగువ జలాశయాల్లోనూ నీటి నిల్వలు లేకపోవడంతో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. జలాశయాల నిర్వహణ అమలు రాష్ర్టాల పరిధిలో ఉన్నప్పుడు తాగునీటి విషయంలో కొన్ని అవకాశాలు ఉండేవి. సాధ్యాసాధ్యాలను ఆలోచించి అవసరమున్నచోట దిగువ జలాశయాల్లోకి నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉండేది. కానీ.. ఇప్పుడు ఇలా నీళ్లు వదలాలంటే కేఆర్ఎంబీ పూర్తి అనుమతులు రావాలి.
పాలేరు జలాశయం నుంచి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలోని 2,439 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం పాలేరు నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ఈ వేసవి గడవడం కష్టంగా మారింది. ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి కూడా ఆరా తీశారు. పాలేరు పరిస్థితి పరిశీలనకు ఇటీవల ఉన్నతాధికారులను పంపారు. అయితే ప్రత్యామ్నాయంగా శ్రీరాంసాగర్ నుంచి నీటిని మళ్లిస్తే తప్ప వేసవిలో పాలేరు కింద నీటి కష్టాలు తప్పేలా లేవు. అయితే ఇటీవల జిల్లాకు వచ్చిన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మిషన్ భగీరథ స్పెషల్ ఆఫీసర్ (ఎస్వో) సందీప్కుమార్ సుల్తానియా.. రోజంతా ఇక్కడే ఉండి పాలేరు నీటిమట్టం, ప్రస్తుత నిల్వలు, నీటి సరఫరా వంటి అంశాలను పరిశీలించి సమీక్షించి వెళ్లారు. ప్రస్తుత నీరు మార్చి చివరి వరకే సరిపోతుందని, తరువాత ప్రత్యామ్నాయం ఏంటనే అంశాలపై చర్చించారు. మళ్లీ సాగర్ నుంచి నీటిని తీసుకోవాలంటే కేఆర్ఎంబీ అనుమతులు రావడం కష్టం కావడంతో ముందస్తు చర్యలపై చర్చిస్తున్నారు.
అయితే తాగునీటి కోసం సాగర్ నుంచి పాలేరుకు ఇటీవల విడుదల చేసిన నీరు 1.50 టీఎంసీలుగా నమోదైంది. కానీ.. కాలువల్లో లాస్లు, నీటి ఆవిరి వంటి కారణాలతో తగినంత నీరు పాలేరుకు రాలేదు. ఒక్కరోజు మాత్రమే 4,500 క్యూసెక్కులు వచ్చాయి. తరువాత క్రమంగా తగ్గుతూ గురువారం మధ్యాహ్నం వరకు 1,187 క్యూసెక్కులు చేరుకున్నాయి. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 17.20 అడుగులు మాత్రమే ఉంది. మిషన్ భగీరథకు ఇచ్చే నీటితో రోజుకు 0.25 అడుగుల చొప్పున తగ్గుతోంది. దీంతో ఈ నిల్వలు నెల రోజులు కూడా సరిపోయే పరిస్థితి లేదు. మార్చి 15 తరువాత తాగునీటికి కష్టాలు మొదలుకానున్నాయి.
పాలేరు రిజర్వాయర్ నుంచి ఐదు జిల్లాలోని 2,41,129 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా నిత్యం తాగునీరు సరఫరా అవుతోంది. పాలేరు ఇన్టేక్వెల్ నుంచి ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు, నాయకన్గూడెం పంప్హౌస్ నుంచి సూర్యాపేట జిల్లాకు తాగునీటిని అందిస్తున్నారు. అలాగే, గుర్వాయిగూడెం నుంచి 38 గ్రామాలకు, పాలేరు నుంచి 35 గ్రామాలకు, జీళ్లచెరువు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఖమ్మం నగరంతోపాటు ఖమ్మం జిల్లాలోని 203 గ్రామాలకు, మాదిరిపురం నుంచి మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లోని 1,769 గ్రామాలకు, అన్నారుగూడెం నుంచి సూర్యాపేట జిల్లాలోని 41 గ్రామాలకు, చండ్రుపట్ల నుంచి 185 గ్రామాలకు, చిల్పకుంట్ల నుంచి 168 గ్రామాలకు కలిపి మొత్తం 2,439 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. ఇలా తాగునీటి అవసరాల కోసం రోజుకు 0.013706 టీఎంసీల చొప్పున ఏడాదికి 5.09467 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. తాజా గడ్డు పరిస్థితి నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రభావం కన్పిస్తోంది. అయితే సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతోనే పాలేరు కింద సాగునీటి, తాగునీటి కష్టాలు తొలగిపోతాయని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు.