చింతకాని, నవంబర్ 1 : దళితబంధు పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలని, దళితబంధు యూనిట్లపై అధికారుల పర్యవేక్షణ పెరగాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం చింతకాని మండలంలోని మత్కేపల్లి నామవరం, తిమ్మినేనిపాలెం, తిర్లాపురం తదితర గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి దళితబంధు పథకం ద్వారా లబ్ధి పొందిన దళితుల స్థితిగతులను పరిశీలించి వారితో మాట్లాడారు.
మత్కేపల్లి నామవరం గ్రామంలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న డెయిరీ యూనిట్ను పరిశీలించిన ఆయన ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేదెలు, జీవాల సంరక్షణకు ప్రత్యేకంగా పశువైద్యాధికారిని కేటాయించాలని వెటర్నరీ జేడీను ఆదేశించారు. తిర్లాపురంలో పలు యూనిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తిమ్మినేనిపాలెంలో పలు యూనిట్లను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దళితబంధు పథకం ద్వారా దళితులంతా కోటీశ్వరులు కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, ప్రత్యేకాధికారులు, మండలాధికారులు, కార్యదర్శులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.