పర్ణశాల, మార్చి 25 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలో సోమవారం హోలీ పర్వదినం రోజు డోలోత్సవం కార్యక్రమాన్ని అర్చకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి తిరువారాధన, తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా అంకురార్పణ కార్యక్రమం చేపట్టారు. తర్వాత నిత్య హోమం, స్వామివారికి విశేష ప్రసాద నివేదన కార్యక్రమాన్ని జరిపారు. సోమవారం ఉదయం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా డోలోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను కనుల పండువగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, లక్ష్మీపూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. వచ్చే నెలలో జరిగే శ్రీరామ నవమిని పురస్కరించుకొని రామయ్యను పెళ్లి కొడుకు చేసే తంతులో భాగంగా ముత్తైదువుల చేతులతో పసుపు కొమ్ములు చూర్ణంగా చేసి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు సమర్పించారు.
రంగుల ద్రవ్యాలతో వసంతం తయారు చేసి స్వామివారికి సంప్రోక్షణను ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్ర స్వామివారు పెండ్లి కొడుకు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారికి తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. రాములోరి కల్యాణ తలంబ్రాలను ముత్తైదువులు పసుపు, కుంకుమలతో కలిపి సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు శేషన్ కిరణ్కుమారాచార్యులు, రామభద్రాచార్యులు, అమరవాది వెంకటరామన్, నరసింహాచార్యులు, ఆలయ స్పెషల్ ఆఫీసర్ సీసీ అనిల్కుమార్, గుమస్తా ప్రసాద్, సిబ్బంది రాము, శివ పాల్గొన్నారు.