మామిళ్లగూడెం, జూన్ 12 : ఖమ్మం నగరంలో 12ఏళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం ఖమ్మం నగరంలో పోలీస్ కమిషనర్ సునీల్దత్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిన ఈ ఘటనలో బాలికకు తక్షణమే న్యాయం చేయాలని, నిందితుడిపై పోక్సో చట్టం కింద కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగికదాడుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని, బాలికకు ప్రభుత్వం తరఫున అవసరమైన వైద్య, ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరి ఉద్యోగ భద్రత తక్షణమే కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు, అపార్ట్మెంట్స్, ఇతర ప్రాంతాల్లో బాలికలు, మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, బాషబోయిన వీరన్న, నాయకులు రెంటాల ఆనంద్, దుర్గయ్య, బలుసు మురళీకృష్ణ, లింగనబోయిన సతీష్, మహ్మద్ రఫీ, పగడాల నరేందర్, యలమద్ది రవి, గవర్రాజు శంకర్రాజు, పటేటి సాయి, పోలూరి రామ్ తదితరులు పాల్గొన్నారు.