ఖమ్మం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దినదిన గండంగా మారాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తమది ఇందిరమ్మ రాజ్యమంటూ చెబుతున్న కాంగ్రెస్ పాలనలో పేదలకు అసలు జీవించే హక్కు లేదా?’ అని ప్రశ్నించారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో బడుగు జీవుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లగచర్లలో గిరిజన బిడ్డల భూములను లాక్కున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఖమ్మం వెలుగుమట్ల భూములపైనా కన్నేశారని, అందుకే అక్కడి పేదలపై దాష్టీకానికి దిగారని ఆరోపించారు. భూదాన్ పట్టాలతో పదేళ్లుగా జీవిస్తున్న పేదలపైకి, వారి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపారని, కడు పేదలను ఈడ్చిపడేశారని ధ్వజమెత్తారు.
అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని తాతా మధు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
గురువారం ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని తాతా మధు కోరారు. ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలో కాంగ్రెస్ సర్కారు కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలిస్తారని, రోడ్డు మీదకు విసిరేసిన పేదలను పరామర్శిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, కర్నాటి కృష్ణ, మక్బూల్, బిచ్చాల తిరుమలరావు, తాజుద్దీన్, బెల్లం వేణుగోపాల్, బాషబోయిన వీరన్న, తాతా ప్రసాద్, హనుమంతరావు, బలుసు మురళీకృష్ణ, మహ్మద్ రఫీ, మంచానాయక్, ఉద్యమకారులు పగడాల నరేందర్ పాల్గొన్నారు.