‘బండీ.. జాగ్రత్తగా మాట్లాడు. ఒళ్లు దగ్గర పెట్టుకో కపోతే భరతం పడతాం.. ఖమ్మంలో ఊరే గిస్తాం..’ అని హెచ్చరించారు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు. సీఎం కేసీ ఆర్, మంత్రి పువ్వాడపై అవాకులు చెవాకులు పేలితే సహించబోమని స్పష్టం చేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు రాజ కీయ అజ్ఞానుల్లా మాట్లాడుతున్నారని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే వారి లక్ష్యమని విమర్శించారు. టీఆర్ఎస్పై బీజేపీ నాయకులు విషపుదాడికి పూను కోవడాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తుక్కగూడ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ సభకు వచ్చిన ప్రజలతో ‘జై తెలంగాణ’ అని కూడా అనిపించలేదని విమర్శించారు. రాష్ట్రంపై వారికి ఎంత ప్రేమ ఉందో తెలుసు కునేందుకు ఇదే ఉదాహరణ అని అన్నారు.
ఖమ్మం, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే భరతం పడతామని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ హెచ్చరించారు. సోమవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్(టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్పై అవాకులు, చెవాకులు పేల్చడం సరికాదన్నారు. రాజకీయ అజ్ఞానులైన బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై విషపుదాడికి పూనుకోవడాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
గాంధీని చంపిన గాడ్సే వారుసులు బీజేపీ వారని అలాంటి నేతలు కేసీఆర్ను విమర్శించడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీకు అప్పగించి వారిని ప్రపంచ కుబేరులుగా తయారు చేస్తున్న బీజేపీ, దేశంలోని సామాన్య ప్రజల గురించి ఆలోచన చేయడంలేదన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. కోట్ల రూపాయలను ట్యాక్స్ల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి చెల్లిస్తుంటే 30శాతం పన్నులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం నిధుల వరద కురిపిస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ రాష్ర్టానికి ఏ ఒక్క పరిశ్రమను కాని, ప్రాజెక్టు తెచ్చాడా అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, నాయకుడు గుండ్లపల్లి శేషు పాల్గొన్నారు.