చర్ల, మార్చి 16: కాంగ్రెస్వన్నీ మాయమాటలేనని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. వాటి వల్లనే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ ఎన్నికల హామీలను కూడా నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. చర్లలో శనివారం పర్యటించిన ఆమె.. మొదట బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో, తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ హామీలను అమలుచేస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పాలకులు.. వంద రోజులు అవుతున్నా ఆ హామీలను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్ని ఆమెను ఆరెస్టు చేయించాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలు తప్పవని బీఆర్ఎస్ అధినేత ఆనాడే అన్నారని గుర్తుచేశారు. ఆ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు.
ప్రజలు కూడా నిజాలు గ్రహించారని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించనున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. మాలోత్ కవితను గెలిపించేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు మానే రామకృష్ణ, శ్రీనివాసరాజు, రావులపల్లి రాంప్రసాద్, సోయం రాజారావు, పోలిన లంకరాజు, గీద కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు.