సత్తుపల్లి, డిసెంబర్ 29 : నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని, తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేయడం నా నైజమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తుందని, అన్ని రాష్ర్టాల నాయకులు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 100 మందికి రూ.66.50లక్షలు మంజూరు కాగా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.33.50లక్షల విలువైన చెక్కులు అందించినట్లు చెప్పారు. సత్తుపల్లి అభివృద్ధి కోసం రూ.60 కోట్లు తీసుకువచ్చి నూతన మున్సిపల్ కార్యాలయం, సీసీ, బీటీ రోడ్లు, అర్బన్పార్కులతో పాటు వైద్యసేవల నిమిత్తం రూ.35 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి, పెనుబల్లి, కల్లూరు ఆసుపత్రుల ఆధునీకరణ, నూతన పీహెచ్సీల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. నియోజకవర్గంలో కొందరు తప్పుడు పద్ధతుల్లో రాజకీయాలు చేస్తున్నారని, వారు ముసుగు తొలగించుకోవాలని హితవు పలికారు.
నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తీసుకువస్తున్నానని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.18కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, మండల పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, పాలా వెంకటరెడ్డి, కనగాల వెంకట్రావు, నాయకులు రఫీ, అంకమరాజు, అమరవరపు కృష్ణారావు, దొడ్డా శంకర్రావు, వల్లభనేని పవన్, కంటే అప్పారావు, గొర్ల ప్రభాకర్రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 29 : రామానగరం గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు నీలాల నర్సింహులు గురువారం మృతి చెందారు. నర్సింహులు భౌతికకాయంపై ఎమ్మెల్యే సండ్ర పూలమాల వేసి నివాళి అర్పించి నర్సింహులు కుటుంబసభ్యులను పరామర్శించారు.
పెనుబల్లి, డిసెంబర్ 29 : తాళ్లపెంటలో గురువారం నడిపల్లి పెంటయ్య మృతి చెందాడు. మృతదేహంపై ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. నాయకులు కనగాల వెంకటరావు, కొత్తగుండ్ల అప్పారావు, సీతారాములు, వెంకటరెడ్డి తదితరులున్నారు.
సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 29 : బుడోకాన్ కరాటే క్లబ్ కరాటే మాస్టర్ పిచ్చయ్య ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈనెల 24, 25 తేదీల్లో జరిగిన జాతీయ కరాటే పోటీల్లో 25 మెడల్స్ సాధించిన సత్తుపల్లి విద్యార్థులను గురువారం విశ్వశాంతి విద్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఎంవీఐ సంగం వెంకటపుల్లయ్య, సత్తుపల్లి ఎంబీఏ పుల్లయ్య, కౌన్సిలర్ ప్రవీణ్, బుడోకాన్ కరాటే క్లబ్ సత్తుపల్లి గౌరవ అధ్యక్షుడు చిత్తలూరి ప్రసాద్, కరాటే మాస్టర్ బాలస్వామి, వెంకట్రావు, కోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శివగంగ వాటర్ప్లాంట్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఆవిష్కరించారు.