సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 6: గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే సంకల్పం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అందుకని ఆయనే ఓ ఇంజినీర్లా మారి సీతారామ ప్రాజెక్టుకు డిజైన్ రూపకల్పన చేశారని వివరించారు. సత్తుపల్లి పట్టణం, మండలంలో 115 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బుధవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకురావడం ద్వారా ఇక్కడి బీడు భూములకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గానికి సాగర్ కాలువల ద్వారా గోదావరి జలాలను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను తాను కోరానని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఉన్నతాధికారులతో చర్చించి ఇక్కడి రైతులకు నీరందించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. గత కాంగ్రెస్ పాలనలో గోదావరిపై రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే.. అందులో ఒకటి ఆంధ్రాలో కలిసిపోయిందని, మరొకటి అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు. తాను మంత్రిని కాకపోయినా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా ఇతర మంత్రుల సహకారంతో రూ.వేల కోట్ల నిధులతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశనని అన్నారు. త్వరలో సత్తుపల్లికి మంజూరైన నర్సింగ్ కళాశాలను ప్రారంభించుకోనున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, వనమా వాసు, కూసంపూడి మహేశ్, కూసంపూడి రామారావు, దొడ్డా హైమావతి, రఫీ, అంకమరాజు, మట్టా ప్రసాద్ పాల్గొన్నారు.