సత్తుపల్లి టౌన్, జూన్ 11 : తెలంగాణ యాస, భాషకు వన్నె తెచ్చింది సీఎం కేసీఆర్యేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ అనేక పథకాలను చేపట్టారని, దేశంలో అభివృద్ధి చెందిన 20 పంచాయతీల్లో.. 17 పంచాయతీలు తెలంగాణవే ఉన్నాయన్నారు. దీని ద్వారా తెలంగాణ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో యావత్ దేశానికి తెలుస్తున్నదన్నారు. ఎండలతో విద్యుత్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగినా.. కోతలు లేని విద్యుత్ అందించడంతోపాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత తెలంగాణ రాష్ర్టానికే దక్కుతున్నదన్నారు.
సాహితీ వేత్తలు, ఉద్యమకారుల ద్వారానే రాష్ర్టాన్ని సాధించుకున్నామని, వారిని గౌరవించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమ్మేళనంలో పాల్గొన్న సత్తుపల్లి ప్రాంత కవులు, సాహితీవేత్తలు.. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, అనంతరం తెలంగాణ అభివృద్ధి కోసం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం తదితర పథకాల గురించి కవులు తమ కవితల ద్వారా వివరించారు. కవి సమ్మేళనం అనంతరం కవులు, తెలంగాణ ఉద్యమకారులను శాలువా, పూలమాలలతో ఎమ్మెల్యే సండ్ర ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, కమిషనర్ సుజాత, కవులు మధుసూదన్రాజు, రామకృష్ణ, మల్లికార్జునరావు, రమణమూర్తి, అయ్యదేవర శేషగిరిరావు, మాదిరాజు మాలతి, కల్యాణశర్మ, పిచ్చయ్య, వాసు, సాగర్, ఉద్యమకారులు అయూబ్పాషా, బండి అంజిరెడ్డి, తోట రామారావు, అక్బర్ సలీమ్, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, షేక్ చాంద్పాషా, తడికమళ్ల ప్రకాశ్రావు, మధు తదితరులు పాల్గొన్నారు.