కల్లూరు, ఏప్రిల్ 23 : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్లూరు పట్టణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు మంత్రులు హరీశ్రావు, పువ్వాడ అజయ్కుమార్ ఉదయం 10గంటలకు చేరుకుంటారని, అక్కడి నుంచి భారీ మోటారుసైకిల్, కార్ల ర్యాలీగా వెళ్లి పట్టణంలో రూ.10.50కోట్లతో నిర్మించతలపెట్టిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
అక్కడి నుంచి రూ.2కోట్లతో ఎన్ఎస్పీ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేస్తారని, అనతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు హాజరవుతారన్నారు. వారితో పాటు జిల్లా అధ్యక్షుడు తాతా మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధిరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతోపాటూ జిల్లా నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కల్లూరు, పుల్లయ్యబంజర, హనుమాతండా, కిష్టయ్యబంజర, తూర్పులోకవరం, పడమటి లోకవరం, కప్పలబంధం, బత్తులపల్లి, ఎర్రబంజర, లక్ష్మిపురం, నారాయణపురం, కొర్లగూడెం, పేరువంచ, ముగ్గువెంకటాపురం, చండ్రుపట్ల, రఘునాధగూడెం గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.
అనంతరం కళాశాల ప్రాంగణంలో నిర్వహించే సమ్మేళన సభా ఏర్పాట్లను ఆయన పరిశీలించి సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 10వేల వాటర్బాటిళ్లు, 10వేల మజ్జిగ ప్యాకెట్లు, ఎండ తగలకుండా కూలర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మధుసూదన్రావు, ఏసీపీ రామానుజంతో కలిసి ఎమ్మెల్యే హెలీప్యాడ్ పరిశీలించారు. అనంతరం సోమవారం గ్రీవెన్స్ ఉన్నందున కలెక్టర్ మంత్రి పర్యటనలో ఉంటారని, ఎవరైనా దరఖాస్తు చేయాలనుకుంటే హెలీప్యాడ్ వద్ద ఎస్ఐకు దరఖాస్తులు ఇవ్వాలని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, ఎంపీపీ బీరవల్లి రఘు, జిల్లా, మండల రైతుబంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్ష్మినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, పెడకంటి రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, కాటంనేని వెంకటేశ్వరరావు ఉన్నారు.