సత్తుపల్లి/ సత్తుపల్లి టౌన్, ఏప్రిల్ 27: పార్లమెంటు నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకంగా దళితబంధు పథకం అమలు చేస్తున్నారని అన్నారు. భారతజాతి వైతాళికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి నామకరణం చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన చరిత్రను లిఖించారని పేర్కొన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠించారని అన్నారు. ఆయన ఆదర్శవంతమైన పాలన దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ తీర్మానం చేశారు.
వినూత్నంగా ముద్రించిన కరపత్రాల ప్రదర్శన..
ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ముద్రించామని, ఇక్కడ జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో వాటిని ప్రదర్శించామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. అవే కరత్రాలను హైదరాబాద్ ప్రతినిధుల సమావేశంలోనూ చూపించి మాట్లాడారు. ప్రజలకు చేకూరే లబ్ధి గురించి గ్రామాల వారీ వివరాలతో ఆకర్షణీయంగా ముద్రించిన కరపత్రాలను సమ్మేళనాల సందర్భంగా ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశామని, పథకాల గురించి ప్రజలకు వివరించామని అన్నారు. ఈ సందర్భంగా ఆ కరపత్రాల గురించి సీఎం కేసీఆర్కు కూడా వివరించారు.