ప్రైవేట్ నర్సరీలపై ఉద్యానశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నర్సరీల చట్టాన్ని(2017) పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బంది పడడంతో ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సరీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే భారీ జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిర్వాహకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. విత్తనం ఎక్కడి నుంచి సేకరించింది.. బిల్లుల వివరాలు.. లాట్నెంబర్.. బ్యాచ్నెంబర్.. విత్తన పరీక్ష వివరాలు.. తయారుచేసిన తేదీ.. విత్తనం విత్తిన తేదీ.. నారుమొక్కలు అమ్మిన వివరాలు నిర్వాహకులు కచ్చితంగా తెలియజేయాలని చెబుతున్నారు. నర్సరీ ముఖద్వారం వద్ద బోర్డు పెట్టి అందులో నారుమొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో క్లుప్తంగా పొందుపరచాలని సూచిస్తున్నారు.
కల్లూరు, ఆగస్టు 11: కుల, చేతి వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే కొండంత భరోసా కలుగుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. చేతివృత్తులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని అన్నారు. బీసీ కులాల్లోని వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున రుణసాయం అందించే దశలో ఇది ఆరంభం మాత్రమేనని, ప్రక్రియ ఇంకా చాలా ఉందని, ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున నియోజకవర్గంలోని 300 మంది బీసీ వృత్తిదారులకు మంజూరైన రుణ చెక్కులను కల్లూరు మార్కెట్ యార్డు ఆవరణలో అదనపు కలెక్టర్ అభిలాషతో కలిసి శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.
వృత్తిదారులందరూ ఈ రుణ సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. గృహలక్ష్మి పథకం ద్వారా కూడా ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున నియోజకవర్గంలో 3 వేల మందికి సహాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఆ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని, ఈ పథకాల పట్ల ఎవరూ అపోహలు పెట్టుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కాగా, ఇదే వేదికపై మండలంలోని 21 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, చీరలను ఎమ్మెల్యే సండ్ర పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు రాయల శేషగిరిరావు, జ్యోతి, బాబ్జీప్రసాద్, రవికుమార్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, వనమా వాసు, కట్టా అజయ్బాబు, చెక్కిలాల మోహనరావు, కూసంపూడి రామారావు, బీరవల్లి రఘు, లక్కినేని అలేఖ్య, దొడ్డా హైమావతి, పగుట్ల వెంకటేశ్వరరావు, పాలెపు రామారావు, కాటంనేని వెంకటేశ్వరరావు, పెడకంటి రామకృష్ణ, ఇస్మాయిల్, లక్ష్మణరావు, చందర్రావు పాల్గొన్నారు.