భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : చిన్నారుల ఆలనా పాలనా చూస్తూ వారికి సమయానికి పౌష్ఠికాహారం అందించడంతోపాటు గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సూచనలు అందించే అంగన్వాడీ టీచర్ల పాత్ర అభినందనీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా ప్రభుత్వం మార్చినందున ఉత్తర్వు ప్రతులు అందజేసే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది సేవలను అభినందించిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన అన్ని బాధ్యతలను అంగన్వాడీ సిబ్బంది ఎంతో నేర్పు, ఓర్పుతో చేస్తుంటారని చెప్పారు. గర్భిణి స్థాయి నుంచి బాలింతల వరకు మీ సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. వేతన పెంపుదల కోసం ఎన్నో పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు.