ఖమ్మం రూరల్, నవంబర్ 22: బయటి వ్యక్తులకు, మాయమాటలకు పాలేరు నియోజకవర్గంలో చోటులేదని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. పాలేరు ప్రజలెప్పుడూ మంచి చేసే వాళ్లవైపే ఉంటారని అన్నారు. ఇక్కడి ప్రజలతో తనకు పెనవేసుకున్న అనుబంధం ఉందని, వారి గుండెల్లో తన స్థానం సుస్థిరమని అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం పర్యటించిన ఆయన.. కేఎంసీ 1వ డివిజన్, కరుణగిరి ఏరియా, రాజీవ్ స్వగృహ కాలనీల్లో రోడ్షో నిర్వహించారు. ఈ ఎమ్మెల్యేకు స్థానికులు, మహిళలు ఎదరొచ్చి మంగళ హారుతుల పట్టి, పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లలో కందాళ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని అన్నారు. గడిచిన పదేళ్లలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేసిందని గుర్తుచేశారు. మరోసారి గెలిపిస్తే మరిన్ని సంక్షేమ ఫలాలు అందిస్తుందని అన్నారు.
నూతన మ్యానిఫెస్టోలో చెప్పిన అనేక కొత్త పథకాలను ప్రజల ముంగిటకు తెస్తుందని వివరించారు. ఇన్నేళ్లలో ఏనాడూ ఇక్కడ కన్పించని నాయకులు కొందరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారని, తామే గెలుస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. మంచి చేసిన వాళ్లను ఓడిస్తామని అంటున్నారని అన్నారు. పాలేరు ప్రజలు మాయామశ్చీంద్రల మాటలకు మోసపోయేవాళ్లు కాదని స్పష్టం చేశారు. అహంకారంతో మాట్లాడే వారికి ఇక్కడ చోటు లేదని అన్నారు. కారు గుర్తు అంటే కర్షకుల గుండె చప్పుడని, దానిని ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. పది రోజుల షో తరువాత మాయామశ్చీంద్రల నిజస్వరూపం బయటపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బానోత్ చంద్రావతి, బెల్లం వేణుగోపాల్, అక్కినపల్లి వెంకన్న, కొండం కళమ్మ, మరికంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.