NEET | రామవరం, జులై 13 : ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నీట్ కౌన్సెలింగ్కు హాజరయ్యే మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ”మైనారిటీ స్టేటస్” సర్టిఫికేట్ తప్పకుండా సమర్పించాలని, దీని కొరకు స్థానిక ఈ-సేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. నీట్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీడీఎస్, నర్సింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతాయని అన్నారు.
గతంలో ఈ సర్టిఫికేట్ విద్యార్దులు తాము చదివిన పాఠశాలల నుండి పొందేవారని, రాష్ట్ర రెవెన్యూ శాఖ వారు గతంలో విడుదల చేసిన జీ.ఓ ప్రకారం విద్యార్థులు తహశీల్దార్ కార్యాలయం నుండే మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ పొందాలని, ఇందుకు గాను రెవెన్యూ శాఖ విడుదల చేసిన దరఖాస్తు ఫారంతో పాటు ఓ.సి, బిసి-సి, బిసి-ఈ, బిసి- బి కుల సర్టిఫికేట్ , 10వ తరగతి టిసి, అధార్ కార్డు లేదా రేషన్ కార్డు, నీట్ -2025 ర్యాంక్ కార్డుతో ఈ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. కావున మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్ లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, జోరాస్ట్రీయన్ లు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. ఇతర సమాచారం కోసం మరియు మైనారిటీ స్టేటస్ దరఖాస్తు ఫారం కొరకు 8520860785 నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.