ఖమ్మం, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభలో పాల్గొనడానికి ఖమ్మం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఖమ్మంలో సుమారు 4 గంటల పాటు గడిపారు. యాదాద్రి నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరిన అతిరథ మహారథులు సరిగ్గా మధ్యాహ్నం 1.32 గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో ల్యాండ్ అయ్యారు. అతిథులకు మంత్రులు హరీశ్రావు, అజయ్కుమార్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సులో 1:40 గంటలకు సమీకృత కలెక్టరేట్కు చేరుకున్నారు.
అక్కడ సీఎం కేసీఆర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించగా 1:45 గంటలకు మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య అం గరంగ వైభవంగా కలెక్టరేట్ను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 1:50 గంటలకు కలెక్టర్ చాంబర్ను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ను ఆయన సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో రెండో దశ కంటివెలుగు కార్యక్రమాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, రాష్ట్ర మంత్రులు సహా అతిథులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
కంటివెలుగు కోసం అధికారులు చేసిన ఏర్పాట్లను సీఎం సహా అతిథులు పరిశీలించారు. పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారి పేరు నమోదు చేయడం దగ్గరి నుంచి ఆధార్కార్డు పరిశీలించడం, కంటి సమస్యలను తెలుసుకోవడం, కంటి పరీక్షలు చేయడం, పరీక్ష ఫలితాలను తెలియజేయడం, అవసరమైన మందులు ఇవ్వడం, కళ్లజోళ్లను పంపిణీ చేయడం వంటి వాటి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కంటివెలుగు ప్రాధాన్యాన్ని మంత్రి హరీశ్రావు అతిథులకు వివరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు మంత్రులు, ఎంపీలు, బీఆర్ఎస్ నేతలు, ఎంపీలతో కలిసి అతిథులు మధ్యాహ్న భోజనం చేశారు. 3 గంటలకు స్టేట్ చాంబర్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని 3:30 గంటలకు బహిరంగ సభ వేదిక వద్ద వెళ్లారు. బహిరంగ సభలో సుమారు 2 గంటల పాటు ముఖ్యమంత్రులు, అతిథులు ఉన్నారు. తొలుత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రసంగించి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్లో విజయవాడకు పయనమై వెళ్లారు. 5:30 గంటలకు ముఖ్యమంత్రులు, అతిథుల ప్రసంగాలతో సభ ముగిసింది. దీంతో 5:35 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. కేజ్రీవాల్, భగవంత్మాన్, అఖిలేశ్యాదవ్, రాజాలను హెలీప్యాడ్ వద్దకు తోడ్కొని వెళ్లారు. వారిని హెలీకాప్టర్ ఎక్కించి వీడ్కోలు పలికారు. 5:40 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో హెలీకాప్టర్లో హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. తొలుత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణించిన హెలీకాప్టర్ విజయవాడలో దించి తిరిగి ఖమ్మం చేరుకుంది. అదే హెలీకాప్టర్లో సీఎం కేసీఆర్ హైదరాబాద్ పయనమయ్యారు.