భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : సాగు భూములకు అనుగుణంగా పంటల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సుజాతనగర్ మండలంలోని రవి హైబ్రిడ్ వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. వివిధ రకాల వంగడాల విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో జన్మించిన మన్నేపల్లి రవి బీటెక్ చేసి విత్తన క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎన్నో రకాల హైబ్రిడ్ విత్తనాలను తయారు చేసి మన రాష్ర్టానికే కాదు.. ఇతర రాష్ర్టాలకు కూడా అందుబాటులో ఉంచుతున్నారని అన్నారు.
అనంతరం అంజనాపురం గ్రామంలోని టమాట విత్తన క్షేత్రాన్ని పరిశీలించారు. రవి తండ్రి కూడా తనకు బాగా పరిచయమని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రైతుమిత్ర పేరుతో ఏటా రైతులకు ఉత్తమ అవార్డులు ఇస్తున్నామని, ఈసారి కూడా అవార్డులు మంత్రి తుమ్మల చేతులమీదుగా ఇస్తామని రవి ప్రకటించారు. మొదటి బహుమతి రూ.3 లక్షలు, రెండో బహమతి రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.లక్ష ఇస్తామన్నారు. మంత్రి వెంట వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు, నాగసీతారాములు, నూకల రంగారావు, నల్లమల వెంకటేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారి మరియన్న, నాయకులు ఉన్నారు.