అశ్వారావుపేట, జనవరి 29: అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్గా మార్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం ఆయన ఆయిల్ఫెడ్ అధికారులతో కలిసి అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ను పరిశీలించి మాట్లాడారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.30 కోట్లతో పవర్ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో ప్లాంట్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి భూములు ఉద్యాన పంటలకు అనుకూలమని శాస్త్రవేత్తలు గతంలోనే ప్రకటించారని గుర్తుచేశారు. రైతులు ఆర్థికంగా నిలబడాలంటే ఒకే వ్యవసాయ క్షేత్రంలో మూడు, నాలుగు రకాల పంటలను సాగు చేయాలని సూచించారు. తద్వారా ఒక పంట ద్వారా నష్టం వాటిల్లినా, ఇతర పంటల ద్వారా ఆర్థిక భరోసా వస్తుందన్నారు. ఉద్యాన తోటల్లో అంతర పంటలుగా కోకో, వక్క, జాజీ సాగు చేయవచ్చన్నారు. అంతర పంటలు సాగు చేసే రైతులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసానిచ్చారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలోనూ ఉద్యాన కోర్సులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమించిన తర్వాత ఆ పని మొదలు పెడతామన్నారు. వీసీని అశ్వారావుపేటకు ఆహ్వానిస్తామన్నారు. మంత్రి వెంట ఆయిల్ ఫాం రైతుల సంఘం నాయకులు ఆలపాటి రామ్మోహనరావు, రామచంద్ర ప్రసాద్, బండి భాస్కర్, బత్తిన పార్థసారథి, నార్లపాటి రాములు ఉన్నారు.
దమ్మపేట రూరల్, జనవరి 29: దమ్మపేట మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సోమవారం తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. పామాయిల్ ఉప ఉత్పత్తుల (వ్యర్థాలు) ద్వారా లాభాలనూ రైతులకు ఇవ్వాలని టీఎస్ ఆయిల్ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీ క్రష్షింగ్ సామర్థ్యం 60 టన్నుల నుంచి 90 టన్నులకు పెరిగిందని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి వివరించారు. అనంతరం మంత్రి ఫ్యాక్టరీలో కలియదిరిగారు. పలు విభాగాలను సందర్శించి సిబ్బందికి సూచనలిచ్చారు. పర్యటనలో ఆయిల్ఫెడ్ డివిజినల్ మేనేజర్ బాలకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ ఉన్నారు.
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన మంత్రి తుమ్మల వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లేకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే స్థానికంగానే ఉండి కూడా మంత్రి వద్దకు రాకపోవడం స్థానికంగా చర్చనీయాశమైంది. పర్యటన తర్వాత ఎమ్మెల్యే గండుగులపల్లిలోని మంత్రి నివాసంలో మంత్రి తుమ్మలను కలిశారు. దీనిలో ఏం మతలబు ఉన్నదో తెలియదని స్థానికులు భావిస్తున్నారు.
భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు సోమవారం గండుగులపల్లిలోని మంత్రి నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై పరస్పరం చర్చించారు.