ఖమ్మం, ఏప్రిల్ 13: మున్నేరు వాగు సీసీ వాల్ ప్రొటెక్షన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని తన నివాసంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులతో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు రెండు నియోజకవర్గాల ప్రజలకు సంబంధించినదని అన్నారు. ఇరువైపులా ముంపు సమస్యను నివారించే విధంగా నిర్మాణం ఉండాలన్నారు. అలాగే, ఆహ్లాదపరిచే విధంగా వాల్ నిర్మించాలని సూచించారు.
వీలైతే బోటింగ్ సైతం ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్లో వాల్ ఎత్తు పెంచుకోవడానికి వీలుగా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో ఎంత వరద వచ్చినా మురుగుకాలువల ద్వారా నగరంలోని బ్యాక్ వాటర్ రాకుండా పటిష్టమైన డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టు మొదలైన ప్రాంతం నుంచి ముగిసే ప్రకాశ్నగర్ కింది ప్రాంతం వరకు ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అవసరమైతే కొత్త చెక్డ్యాంల నిర్మాణానికి ప్రపోజల్ తయారు చేసి ఖమ్మం నగర ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని కోరారు. మున్నేరు నదిలో చెత్త పడేయకుండా రెయిలింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠధామం దగ్గర స్నానాలు చేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన చోట మెట్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. తాను కలెక్టర్తో చర్చించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని సంస్థ ప్రతినిధులకు తెలిపారు.