భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రజా పాలన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులను రాజులుగా చేయడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన అందిస్తోందని వివరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలుత కొత్తగూడెం ప్రగతిమైదాన్లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల సభలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా రానున్న రోజుల్లో లక్షల ఎకరాలు సాగులోకి రానున్నట్లు చెప్పారు. రైతులు పండించిన ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తున్నామన్నారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్రంలో ఎక్కడా పేదలు పూరి గుడిసెల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే మొదటి విడత ఇళ్లు పూర్తయ్యాయని, ఇప్పుడు రెండో విడత ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. కాగా, అవతరణ వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. వేడుకల్లో అదనపు కలెక్టర్లు విద్యాచందన, వేణుగోపాల్, డీఆర్వో పద్మావతి, మేయర్ గణేశ్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఖాళీ కుర్చీలు..
ఈ వేడుకలకు ఆశించినస్థాయిలో జనం రాకపోవడంతో ప్రాంగణంలో కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులను వేడుకలకు ఆహ్వానించకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా ఉద్యమకారులకు అధికారిక సన్మానాలు ఉండేవని, ఈసారి వారికి పిలుపే లేకుండాపోయిందని పలువురు చర్చించుకున్నారు.