భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది. మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన వరద ఆదివారం నుంచి క్రమేపీ తగ్గుతూ 50 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం ఉదయం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉధృతి తగ్గుతున్నా పలు గ్రామాల్లో నీరు నిలవడంతో భద్రాచలం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గుండాల మండలంలోని పలు గ్రామాలను ఆదివారం కలెక్టర్ ప్రియాంక ఆల సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. గోదారి వరద పరిస్థితిని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కలెక్టర్కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
-ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. మూడు రోజుల పాటు ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుతూ వస్తున్నది. శనివారం రాత్రి 10 గంటలకు 56.10 అడుగుల వద్ద ఉన్న ప్రవాహం ఆదివారం రాత్రి 8 గంటలకు 50 అడుగులకు చేరుకున్నది. దీంతో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. సోమవారం ఉదయం వరకు ప్రవాహం మరింత తగ్గవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం పట్టణంలో అధికారులు పారిశుధ్య చర్యలను ముమ్మరం చేశారు. భద్రాచలం- వెంకటాపురం, భద్రాచలం- ఛత్తీస్గఢ్కు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఇప్పటికీ వరద నిలిచే ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
జలదిగ్బంధంలో ఉన్న గ్రామాలకు చెందిన బాధితులకు అధికారులు నిత్యావసర సరుకులు, ఆహారాన్ని చేరవేస్తున్నారు. బూర్గంపహాడ్ మండలం సారపాక- రెడ్డిపాలెం ప్రధాన రహదారిపై వరద నిలిచి ఉండడంతో బూర్గంపహాడ్-భద్రాచలం మధ్య రాకపోకలు స్తంభించాయి. వరద సహాయక పరిస్థితులను కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ వినీత్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వరద సహాయ చర్యలపై కలెక్టర్ ప్రియాంక ఆలకు ఫోన్ చేసి ఆరా తీశారు. వరదలపై అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. అత్యవసర సహాయక చర్యలకు సారపాక ఐటీసీ పాఠశాలలో హెలికాఫ్టర్ను సిద్ధంగా ఉంచామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి వసతులు కల్పిస్తున్నామని సమాధానమిచ్చారు.
ముంపు బాధితులను ఆదుకుంటాం
గుండాల, జూలై 30: వర్షాల కారణంగా నష్టపోయిన ముంపు బాధితులను ఆదుకుంటామని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. ఆదివారం ఆమె జిల్లా అధికారులతో కలిసి గుండాల మండలంలో విస్తృతంగా పర్యటించారు. మోదుగులగూడెం వద్ద కిన్నెరసాని వాగుపై తెగిన వంతెనను పరిశీలించారు. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గిరిజన గూడేల్లో ముంపు బాధితులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. మళ్లీ వానలు కురిసి వాగులు ఉప్పొంగే ప్రమాదం ఉందని, గ్రామస్తులు వాగులు దాటొద్దని సూచించారు. అధికారులు గ్రామాల్లో పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలన్నారు. జలదిగ్బంధంలో ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలకు నిత్యావసరాలు చేరవేయాలన్నారు. పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్, రోడ్లు భవనాలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భీమ్లా, ఆర్డీవో శిరీష, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి శిరీష, తహసీల్దార్ నాగదివ్య, సీఐ రవీందర్, ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబోయిన రామక్క, ఎంపీడీవో సత్యనారాయణ ఉన్నారు.