ఖమ్మం, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఐదు రోజులపాటు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి 56.10 అడుగులకు చేరిన నీటిమట్టం మంగళవారం 27 అడుగులకు చేరింది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు తగ్గడంతో భద్రాచలం-వెంకటాపురం, భద్రాచలం-ఛత్తీస్గఢ్ జాతీయ రహదారుల్లో యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతవాసులు తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వరద తగ్గుముఖం పడుతుండడంతో జిల్లా అధికారులు శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించారు.
పరీవాహక ప్రాంతాల్లో వైద్య సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యారు. ప్రజా రవాణా యథావిధిగా కొనసాగింది. కలెక్టర్ ప్రియాంక ఆల వరద పరిస్థితిని సమీక్షించి వరద తగ్గుతున్న తీరును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ఫోన్లో వివరించారు. వరద ముంపు ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య సేవలను ముమ్మరం చేయాలని పువ్వాడ అజయ్ ఆదేశించారు.