ఖమ్మం, జనవరి 6: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ప్రజల వద్దకు వస్తే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికిశ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం రూ.2 కోట్ల ఎల్ఆర్ఎస్ నిధులను మంత్రి కేటీఆర్ మంజూరు చేశారని, దానికి సంబంధించిన జీవో కూడా వచ్చిందని తెలిపారు. ఏ అభివృద్ధి పనికీ నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.
‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 6 గంటలకే నగరంలోని 50వ డివిజన్లో మంత్రి అజయ్ తన పర్యటన ప్రారంభించారు. తాను చూపిన పాత డ్రెయిన్ స్థానంలో నూతనంగా సీసీ డ్రెయిన్లు వెంటనే నిర్మించాలని, వాటికి ఇంజినీరింగ్ అధికారులతో అంచనాలు తయారు చేయించి తనకు అందించాలని, వెనువెంటనే పనులు ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
తొలుత ఆర్టీసీ కాలనీకి చేరుకున్న మంత్రి అజయ్.. స్థానిక కార్పొరేటర్ రాపర్తి శరత్, ఇతర అధికారులతో కలిసి ఆ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువమంది డ్రెయిన్ల సమస్యను ప్రస్తావించడంతో తగిన చర్యల కోసం కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రోడ్డు పక్కనే తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉండడాన్ని గమనించిన మంత్రి అజయ్.. తగిన రక్షణ చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఏడీని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురితో మాట్లాడి.. ప్రభుత్వ పథకాల అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ పాతిమా జోహారా ముక్తార్, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్కుమార్, మాజీ కౌన్సిలర్ దోరేపల్లి రవికుమార్, జక్కుల లక్ష్మయ్య, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు చంద్రావతి, బీఆర్ఎస్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, షకీనా, రవికుమార్, గోరంట్ల సోదరులు, పాపారావు, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.