‘ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. రాజకీయ నిరుద్యోగులు ఇక బయటకు వస్తారు.. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు.. వారు అధికారంలో ఉన్నప్పుడు, పదవులు అనుభవించినప్పుడు అభివృద్ధి కోసం తట్టెడు మట్టిపోయనోళ్లు నాపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు.. సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారు.. బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలుపుతాం అంటున్నారు.. ఇక్కడి ప్రజలు విజ్ఞులు. చైతన్యంగల వారు. ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు వారికి తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపిస్తారు.. ఆర్టీసీ కార్మికులను గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. వారిని గుండెల్లో పెట్టుకుని చూస్తున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని నూతన బస్టాండ్ పక్కన రూ.40 కోట్ల నిధులతో నిర్మించనున్న ఆర్టీసీ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. హైదరాబాద్లోని కన్వెన్షన్ హాల్ తరహాలో ఇక్కడ కూడా హాల్ నిర్మిస్తామన్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 3: ఖమ్మం ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచిస్తారని, మొసలి కన్నీళ్లకు మోసపోరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అయినప్పటికీ వారిని ఏమార్చేందుకు కొందరు రాజకీయ నిరుద్యోగులు వస్తున్నారని విమర్శించారు. అందుకని వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఆర్టీసీ కార్మికులను గుండెల్లో పెట్టుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఖమ్మం నూతన బస్టాండ్ పక్కన రూ.40 కోట్లతో చేపట్టే టీఎస్ఆర్టీసీ ఏసీ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి మంత్రి పువ్వాడ ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఖమ్మం అభివృద్ధికి తట్టెడు మట్టిపోయోనోళ్లందరూ వచ్చి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతుండడం, విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ ఇంత చేశాక ప్రతిపక్షాల మాటాలు వినడానికి ఇక్కడి ప్రజలేమీ అమాయకులు కాదని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 76 ఏళ్లలో నాలుగేళ్ల క్రితం వరకూ ఖమ్మం నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేదని, నాలుగేళ్ల క్రితమే మంత్రి పదవి వచ్చిందని వివరించారు. మంత్రిగా ఉన్నాను కాబట్టే ఖమ్మంలో ఇంత అభివృద్ధి చేయగలిగానని స్పష్టం చేశారు.
కేసీఆర్కు హ్యాట్రిక్ విజయాన్నివ్వాలి..
జరుగుతున్న, జరిగే అభివృద్ధిని ఆపడానికి ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని మంత్రి విమర్శించారు. వారందరికీ ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని కోరారు. సీఎం కేసీఆర్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ముచ్చటగా మూడోసారి కూడా 90 సీట్లతో కేసీఆర్ అధికారంలోకి రానున్నారని అన్నారు.
రెండు వేల సీట్లతో కన్వెన్షన్ హాల్..
1978లో 2 ఎకరాల్లో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ ఇప్పటి అవసరాలకు తగినట్లుగా లేదనే విషయాన్ని మొన్నటి వరకూ పాలించిన ఏ ఒక్కరూ గుర్తించలేదని మంత్రి అజయ్ విమర్శించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాకే కొత్త బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టానని, ఇన్ని ఇబ్బందులొచ్చినా దానిని పూర్తిచేశానని గుర్తుచేశారు. ఆర్టీసీ సంస్థ ఇటీవలే రూ.200 కోట్ల రుణం తీసుకుందని, వాటితో తెలంగాణలో అనేక చోట్ల ఆర్టీసీని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వీటి ద్వారా హైదరాబాద్లో మాదిరిగా 2000 మంది కూర్చునే విధంగా ఏసీ కన్వెన్షన్ హాల్ను నిర్మించబోతున్నామని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, అధికారులు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, పగడాల నాగరాజు, కృష్ణకాంత్, వినోద్, దోరేపల్లి శ్వేత, ఫాతిమా, పగడాల శ్రీవిద్య, కర్నాటి కృష్ణ, శీలంశెట్టి రమ, పసుమర్తి రామ్మోహన్, రాపర్తి శరత్, రావూరి కరుణ, తోట ఉమారాణి వీరభద్రం, నాగచంద్రారెడ్డి, కన్నం ప్రసన్న, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఓడినోళ్లకూ అవకాశమిచ్చిన ఘనత కేసీఆర్దే..
ఖమ్మం, సెప్టెంబర్ 3: సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన మంత్రి పదవి ద్వారా ఈ నాలుగేళ్లలో ఖమ్మాన్ని నలుదిక్కులా అభివృద్ధి చేశానని మంత్రి అజయ్కుమార్ వివరించారు. మరోసారి కూడా అవకాశమిస్తే మరింతగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఖమ్మం నెహ్రూనగర్లో దొండా పుల్లయ్య అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావుతో కలిసి మంత్రి అజయ్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ అందరికి అవకాశాలు ఇచ్చారని అన్నారు. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కొందరు విఫలమయ్యారని అన్నారు. ఓడిపోయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రిని చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. జిల్లాలో కమ్మ సామాజికవర్గానికి చాలా అవకాశాలు ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రిగా తనకు, ఎంపీగా నామా నాగేశ్వరరావుకు, ఎమ్మెల్సీగా తాతా మధుకు, మేయర్గా నీరజకు, ఇంకా అనేకమందికి ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించారని వివరించారు. అన్ని కులాలకూ కేసీఆర్ సమ న్యాయం చేసి అందరివాడిగా నిలిచారని అన్నారు. ఖమ్మంలో ఓడిపోగానే పాలేరు వెళ్లి ఇప్పుడు ఏవో మాటలు చెప్పేవారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. సీతారామ ద్వారా గోదావరి నీళ్లు కేసీఆర్ ద్వారానే ఖమ్మానికి వస్తాయి తప్ప తప్ప ఇతర వ్యక్తుల వల్ల ఎప్పటికీ రావని స్పష్టం చేశారు. అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అజయ్కు మరో అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. పోట్ల మాదవరావు, కంపాటి పిచ్చయ్య, ఆర్టీసీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.