రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. మంగళవారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని టూ టౌన్, త్రీటౌన్ ప్రాంతంలోని పలు డివిజన్లలో పర్యటించారు. ఇంటింటికెళ్లి లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు చీరె అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.
ఖమ్మం, ఫిబ్రవరి 14: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అనేక పేద కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. ఈ పథకాల సాయం అందడం వల్ల ఆడపిల్లలున్న పేదింటి తల్లిదండ్రులు తమ కుమార్తెల వివాహాలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరిపించుకుంటున్నారని అన్నారు. గతంలో నగరంలో ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసిన మంత్రి అజయ్.. ఈ దఫాలో ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి అక్కడిక్కడే పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి ‘వాడవాడకు పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. ఇప్పటి వరకు 4 డివిజన్లలో జరిగిన కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకున్న మంత్రి.. మంగళవారం మాత్రం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
బైక్ ర్యాలీగా వెళ్లి..
ఖమ్మం టూటౌన్, త్రీటౌన్ ప్రాంతాల్లోని పలు డివిజన్లలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఇందుకోసం బైక్ ర్యాలీగా బయలుదేరి నగరంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. ఉదయం టూటౌన్లో, సాయంత్రం త్రీటౌన్లో పలు డివిజన్లలో పర్యటించిన ఆయన.. 98 మంది లబిఝ్ధదారులకు 98 చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుతోపాటు చీర, పండ్లు అందజేశారు. మంత్రి అజయ్ తమ ఇంటికి వచ్చి చెక్కు అందించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
పేద కుటుంబాలకు లబ్ధి..
ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడ పిల్లల వివాహాలు జరిపించే క్రమంలో వారి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని అన్నారు. ఎలాంటి సంక్షోభం వచ్చినా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ దోరెపల్లి శ్వేత, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ పాల్గొన్నారు.
పంగిడి గ్రామానికి చెందిన
ఓ దివ్యాంగురాలు మంగళవారం మంత్రి క్యాంపు రాగా మంత్రి అజయ్ కింద కూర్చొని ఆమెను ఆప్యాయంగా పలుకరించారు. ఆమె ట్రై సైకిల్ కావాలని మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.